Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో మంగళవారం మార్కెట్లను మెప్పించని రీతిలో త్రైమాసిక ఫలితాలను నమోదు చేసింది. జనవరి- మార్చి మధ్య కాలానికి సంస్థ సమీకృత నికర లాభంలో 37 శాతం వృద్ధి నమోదు అయినట్టుగా ప్రకటించింది. దీంతో నాలుగో త్రైమాసికంలో సంస్థ దాదాపు రూ. 2,483 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ దాదాపు రూ.1,803 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.కంపెనీ మొత్తం ఆదాయం రూ.15,915 కోట్లుగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 11శాతం అధికం. విశ్లేషకుల అంచనాల మేరకే ఈ త్రైమాసిక ఫలితాలువెలవడినప్పటికీ సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఎలాంటి తుది డివిడెండ్ను ప్రకటించకపోవడం మార్కెట్లను నిరుత్సాహపరిచింది. ''ఈ సారి కంపెనీ బోర్డు ఎటువంటి తుది డివిడెండ్ను ఆమోదించలేదు. జనవరిలో జరిగిన బోర్డు మీటింగ్లో మధ్యంతర డివిడెండ్ రూ.1ని ప్రకటించాం. 2018-19 ఆర్థిక సంవత్సరానికి దానిని తుది డివిడెండ్గా భావించాల్సి ఉంటుంది.'' అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో మదుపరులు ఉసూరుమన్నారు. కాగా, మరోవైపు విప్రో 3.23 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయాలని నిర్ణయించింది. ఒక్కో షేరుకు రూ.325 చొప్పున చెల్లించి ఈ బైబ్యాక్ను చేపట్టేందుకు కంపెనీ ముందుకు వచ్చింద. ఈ డీల్ మొత్తం విలువ రూ.10,500 కోట్లుగా అంచనా వేస్తున్నారు.
సైబర్దాడులు జరిగాయి..
ఐటీ దిగ్గజ సంస్థల్లో ఒకటిగా వెలుగొందుతున్న విప్రో సంస్థపై ఇటీవలి కాలంలో అత్యాధునికమైన సైబర్ దాడుల జరిగినట్టుగా ఆ సంస్థ మంగళవారం ఒప్పుకుంది. వీటివల్ల కొంత మంది తమ వినియోగదారులు ప్రభావితం అయినట్టుగా సంస్థ తెలిపింది. ఇదే విషయాన్ని స్వతంత్ర జర్నలిస్టు కెర్బ్స్ తన బ్లాగ్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. విప్రో సంస్థలో సైబర్దాడులు జరిగి గత కొన్ని నెలలుగా డేటా చౌర్యంతో ప్రాజెక్టులకు విఘాతం జరుగుతోందని ఆయన తెలిపారు. ఈ వార్తపై తొలిసారిగి స్పందించిన విప్రో సంస్థ కెర్బ్స్ వెల్లడించిన విషయాలు నిజమేనని ఒప్పుకుంది. అయితే ఇది గత వారమే తమ దృష్టికి వచ్చిందని. రాగానే నష్ట నివారణ చర్యలు మొదలు పెట్టినట్టుగా విప్రో తెలిపింది.