Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణదాతల సాయం అందక సంస్థ అన్ని కార్యకలాపాల నిలిపివేత
- బుధవారం రాత్రి నుంచి నిలిచిపోయిన సర్వీసులు..
- ఇక కొత్త యాజమాని వస్తేనే మళ్లీ గాలిలోకి ఎగిరేది!
- సంస్థ కోలుకునే అవకాశాలు అంతంతే: నిపుణులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ విమానయాన రంగంలో మరో చీకటి రోజు నమోదైంది. గత 25 సంవత్సరాలుగా నిరంతరాయంగా సేవలందించి.. దేశీయ విమానయాన రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్న జెట్ ఎయిర్వేస్ బుధవారం రాత్రి నుంచి మూతపడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇకపై తాము ఎగరలేనంటూ జెట్ విమానాలు నేల వాలిపోయాయి. జెట్ ఎయిర్వేస్ బోర్డు చేసిన సూచన మేరకు సంస్థ సీఈవో వినరు దూబే బుధవారం ఎస్బీఐ నేతృత్వంలోని రుణదాతల బృందంతో మధ్యంతర ఆర్థిక సాయం కోసం మరోమారు చర్చలు జరిపారు. అయితే నిధులు ఇచ్చేందుకు ఆయా సంస్థలు విముఖత వ్యక్తం చేయడంతో జెట్ కార్యకలాపాలను బుధవారం రాత్రి నుంచి నిలిపివేయాలని సంస్థ నిర్ణయించింది. రుణదాతల నుంచి గానీ.. ఇతర మార్గాల్లో గానీ రుణం పొందేందుకు తాము చేసిన ప్రయత్నాలేవి ఫలించకపోవడంతో మధ్యంతర ఆర్థిక సాయం లభించలేదని ఇది చాలా బాధాకరమైన విషయమని యాజమాన్యం తెలిపింది. దీంతో బుధవారం( ఏప్రిల్ 17) రాత్రి నుంచే తమ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. బుధవారం రాత్రి 10:30లకు అమృత్సర్ నుంచి ముంబయికి సంస్థ చివరి ఫ్లైట్ పయనమైంది. జెట్ ఎయిర్వేస్కు చివరి విమాన సర్వీస్ అయింది.
ఇబ్బందులను దాటి మళ్లీ ఎగరడం కష్టమే
విమానయాన చరిత్రలో ఒక సంస్థ ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన తరువాత తిరిగి ప్రారంభం కావడం చాలా అరుదైన విషయమేనని ఈ రంగ నిపుణులు చెబుతున్నారు. 2010 సంక్షోభం తరువాత దేశీయంగా మరో పెద్ద విమానయాన సంస్థ మూతపడడం ఇది రెండోసారి. గతంలో ఒక వెలుగు వెలిగిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కూడా ఆర్థిక ఇబ్బందుల చుట్టుముట్టడంతో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆయితే ఆ తరువాత ఎక్కడి నుంచి అనుకున్న ఆర్థిక సాయం లభించకపోవడంతో ఆ సంస్థ కాల గర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు జెట్ ఎయిర్వేస్ విషయంలోనూ ఇదే అంశం పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తునానయి. జెట్ ఎయిర్వేస్లో కీలక వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని వ్యక్తీకరించిన సంస్థలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. కీలక వాటా కోసం ఎతిహాద్ ఎయిర్వేస్, ఎన్ఐఐఎఫ్, టీపీజీ, ఇతర ఇండిగో భాగస్వామ్య సంస్థలు ఈవోఐని దాఖలు చేశాయి. ఇందులో ఎతిహాత్కు తప్ప ఇతర సంస్థలకు ఈ రంగంలో పెద్దగా అనుభవం లేదు. దీనికి తోడు అంతర్జాతీయంగా జెట్కు ఉన్న పలుకుబడితో పూర్తిస్థాయిలో విమాన సేవలను అందుబాటులోకి తెచ్చే సామర్థ్యమూ ఈ సంస్థలక తక్కువే. ఈ సంస్థలు మరింత విస్తృతంగా తమ బిడ్లను దాఖలు చేసేం దుకు.. జెట్ను ఒక మంచి వ్యాపార సంస్థ చేతుల్లో పెట్టాలని భావిస్తున్న రుణదా తలు బిడ్ల దాఖలునకు ఆఖరి తేదిని మే 10 వరకు పొడిగించాయి. అయినా.. సంస్థను ఆదుకొనే సత్తా ఉన్న కంపెనీలు బరిలో లేవన్నది కాదలనలేని మాట. జెట్కు ఉన్న మేటి మార్కెట్ను అవకాశాలను ఇప్పటికే ప్రత్యర్థి సంస్థలు చేజిక్కించు కున్నాయి. దీనిని మళ్లీ సొంతం చేసుకోవడం అంత సులవైన విషయం కాదు.
నేడు ఢిల్లీలో భారీ ర్యాలీ..
దాదాపు 23000 మంది ఉద్యోగులు పని చేస్తున్న దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థను నిలబెట్టే విషయంలో మోడీ సర్కారు తగిన చొరవను చూపలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల జోష్లో ఉన్న ప్రధాని దేశ ప్రతిష్టకు జెట్ రూపంలో భంగం కలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. స్వయంగా జెట్ స్టాప్ తమను ఆదుకోవాలంటూ ప్రభుత్వానికి మోరపెట్టుకున్న ప్రధాని పట్టించుకోలదని ఉద్యోగుల కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దీనిని నిరసిస్తూ గురువారం ఢిల్లీలో ర్యాలీని నిర్వహించేందుకు గాను ఉద్యోగ సంఘాలు సమాయత్తమవుతున్నాయి.