Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రయివేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్చి త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే నికర లాభంలో దాదాపు 22.63శాతం వృద్ధి కనిపించిందని బ్యాంక్ తెలిపింది. దీంతో బ్యాంక్ లాభం రూ.5,885.12 కోట్లకు చేరిందని హెచ్డీఎఫ్సీ వివరించింది. ఈ సీజన్లో రూ.5,805 కోట్ల లాభాన్ని విశ్లేషకులు అంచనా వేయగా బ్యాంక్ అంతకు మించి మెరుగైన పనితీరును ప్రదర్శించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ రూ.4,799.28 కోట్ల లాభాన్ని ప్రకటించింది. వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం 22.8 శాతం పెరిగి రూ.13,089 కోట్లకు చేరింది. గత త్రైమాసికంతో నికర వడ్డీ మిగులు రూ.4.4 శాతానికి చేరింది. కాకపోతే మొండిబకాయిల ప్రొవిజన్లు కూడా రూ.1,541 కోట్ల నుంచి రూ.1,889 కోట్లకు పెరిగాయి. మూడో త్రైమాసికంలో బ్యాంక్ మొత్తం ఆదాయం 22.1 శాతం మేర పెరిగి రూ.31,204.5 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో బ్యాంక్ ఆదాయం రూ.25,549.7 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికానికి బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 1,36 శాతంగా నమోదు అయ్యాయి. అంతకు ముందు ఇది 1.30 శాతంగా ఉన్నాయి. బ్యాంక్ కవరేజ్ నిష్పత్తి మార్చి ముగింపు నాటికి 71 శాతానికి చేరుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మెరుగైన ఆర్థిక ఫలితాల నేపథ్యంలో షేరు ఒక్కింటికి రూ.15 చొప్పున డివిడెండ్ ఇచ్చేందుకు గాను బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ప్రయివేటు ప్లేస్మెంట్ విధానంలో దాదాపు రూ.50,000 కోట్ల మేర నిధులను సమీకరించేందుకు గాను బ్యాంకు బోర్డు సమ్మతి తెలిపినట్టుగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపింది.