Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో మూతపడిన జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు తమకు రావాల్సిన జీతాల బకాయిల చెల్లింపులు వెంటనే జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు లేఖ రాశారు. తమకు కొన్ని నెలలుగా జీతాల బకాయిలు రావాల్సి ఉందని.. సకాలంలో జీతాలు రాక తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వారు రాష్ట్రపతికి రాసిన లేఖలో పేర్కొన్నారు. జెట్ ఎయిర్వేస్ ఉద్యోగులు రాష్ట్రపతితో పాటుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి కూడా వారి ఆర్థిక కష్టాలను ఏకరువు పెడుతూ ప్రత్యేక లేఖ రాశారు. జెట్ ఎయిర్వేస్లోని ఉద్యోగులకు చెందిన వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ (ఎస్డబ్ల్యుఐపీ), ఎయిర్క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్స్ వెల్షేర్ అసోసియేషన్ (జేఏఎంఈడబ్ల్యుఏ) ఉద్యోగ సంఘాలు ఈ సారి ప్రధాన మంత్రి, రాష్ట్రపతులకు విడివిడిగా లేఖలు రాయడం విశేషం. తమ బకాయిల చెల్లింపుతో పాటు తమ విమానయాన సంస్థకు అత్యవసరంగా నిధులు అందేలా చర్యలు తీసుకోవాలని వీరు రాష్ట్రపతి, ప్రధాన మంత్రులను కోరారు. సంస్థలో మొత్తం 23000 మంది ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారని.. పెద్ద హృదయంతో జెట్ ఎయిర్వేస్ మళ్లీ గాలిలోకి ఎగిరేలా చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా జెట్ ఎయిర్వేస్ సంస్థ ఈ నెల 17 వ తేదీ నుంచి తమ అన్ని కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది.
రుణంలో 80% రద్దు చేయండి..
ఆర్థిక కష్టాల్లో ఉన్న జెట్ ఎయిర్వేస్లో కీలక వాటా కొనుగోలుకు గాను ఆసక్తి వ్యక్తీకరణను దాఖలు చేసిన సంస్థలు తాజాగా కొత్త ట్విస్ట్ను ముందుకు తెస్తున్నట్టుగా సమాచారం జెట్ నుంచి వసూలు కావాల్సిన రూ.8500 కోట్ల రుణంలో, దాదాపు 80 శాతాన్ని (దాదాపు రూ.7000 కోట్లు) రద్దు చేసుకోవాలని (హెయిర్కట్) వారు సంస్థకు రుణాలిచ్చిన బ్యాంకర్లనుకోరుతున్నట్లు సమాచారం. అత్యవసర నిధులను బ్యాంకర్లు సమకూర్చకపోవడం వల్లే, కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోయాయని, ఫలితంగా సంస్థ విలువ తగ్గిపోతోందని వీరు పేర్కొన్నట్టుగా సమాచారం. బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తంలో 20 శాతాన్ని మాత్రమే తాము స్వీకరించగలమని బిడ్డర్లు అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అయినా కూడా రాబోయే 2-3 ఏళ్లలో రూ.20,000 కోట్ల పెట్టుబడి అవసరమవుతుందన్నది వారి వాదన. అయితే ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బ్యాంకులు పరోక్షంగా తమ విముఖతను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో జెట్ ఎయిర్వేస్ సంస్థ ఇక మళ్లీ గాలిలోకి ఎగరడం అసాధ్యంగానే మారనుందన్న అంచనాలు వినవస్తున్నాయి.