Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇరాన్ నుంచి ఇక చమురు దిగుమతులోద్దు: అమెరికా
- వినకుంటే భారత్ సహా ఎనిమిది దేశాలపై 'ఆంక్షలు'
- ఇకపై మినహాయింపుల్ని కొనసాగించలేం: శ్వేతసౌథం
- ప్రపంచం వ్యాప్తంగా పెరిగిపోనున్న చమురు కొరత
- రానున్న రోజుల్లో మరింత మండనున్న పెట్రో ధరలు
- రెండు లక్షల కోట్లు నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్లు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
ప్రపంచ పెద్దన్నగా వ్యవహరిస్తున్న అమెరికా తన వక్రబుద్ధిని మరోమారు ప్రదర్శించింది. భారత్, చైనాతో పాటు ఎనిమిది ప్రధాన దేశాలకు గట్టి షాక్నిచ్చింది. చమురు అవసరాల కోసం ఇరాన్పై ఎక్కువగా ఆధారపడుతున్న ఈ ఎనిమిది దేశాలు.. ఇకపై ఆ దేశం నుంచి ఇంధనం కొనుగోళ్లను పూర్తిగా తగ్గించేసుకోవాలని సూచించింది. ఇలా చేయకుంటే ఆయా దేశాలకు ఇప్పటి వరుకు కల్పిస్తున్న ఆర్థిక 'ఆంక్షల నుంచి గణనీయమైన మినహాయింపు'లను (ఎస్ఆర్ఈ) ఇకపై కొనసాగించకూడదని నిర్ణయించింది. భారత్, చైనా సహా ప్రధాన దేశాలకు ఇస్తున్న రాయితీని మే 2వ తేదీ తరువాత నుంచి పొడిగించలేమని ప్రకటించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా మరోసారి ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆంక్షల పునరుద్ధరణ అంశాన్ని ప్రకటించగానే ఐరాపాకు చెందిన అంతర్జాతీయ చమురు మార్కెట్ బ్రెంట్లో ఐసీఈ ఫ్యూచర్ జూన్ సెటిల్మెంట్ ముడి చమురు ధర ఒక్కసారిగా ఎగిసి 73.72 డాలర్లకు చేరింది. మరోవైపు న్యూయార్క్ మార్కెట్లో పీపా చమురు ధర 2.4 శాతం మేర పెరిగింది. ఇంట్రాడేలో ఈ పెరుగుద 3.3 శాతంగా నమోదై 2019లో అత్యధిక ధరను నమోదు చేసింది.
ఇరాన్ను ఇరకాటంలో పెట్టేందుకే..
అణ్వస్త్రాల తయారీ విషయంలో అమెరికా చేసిన హెచ్చరికలను చమురు ఉత్పత్తి దిగ్గజం ఇరాన్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. దీంతో గతేడాది మే నెలలో ఇరాన్తో అమెరికా 2015 అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అప్పటి నుంచి ఆ దేశంపై శ్వేతసౌధం ఆంక్షలు మొదలయ్యాయి. కీలకమైన చమురు కొనుగోళ్లకు సంబంధించి అమెరికా ఆంక్షలను కఠినతరం చేసింది. ఏ దేశమూ ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడానికి వీల్లేదని హుకుం జారీ చేసింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు చమురు ఎగుమతులు ప్రధాన ఆదాయ వనరు. వీటిని నియంత్రించడం ద్వారా ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడంతో పాటు.. ఇరకాటంలో పెట్టాలన్నది ట్రంప్ సర్కారు ఆలోచన. ఇప్పటికే ఈ విషయమై అమెరికా పలు దేశాలను ఆంక్షల పేరుతో బయపెట్టి ఇరాన్ నుంచి చమురు కొనకుండా అడ్డుకుంటోంది. అమెరికా ఆంక్షలతో ఉత్పత్తి తగ్గి చమురు డిమాండ్ పెరగడంతో ధరలు ఆకాశాన్నంటాయి. అమెరికా చర్యల వల్ల గతేడాది ఆగస్టునందు అంతర్జాతీయ మార్కెట్లో 68 డాలర్లుగా ఉన్న పీపా ముడి చమురు ధర, అక్టోబరు నాటికి ఏకంగా 86 డాలర్లకు చేరుకుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సామాన్యులకు చమురు మంట తప్పలేదు. అయితే అప్పట్లో ఇతర చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తితని పెంచడంతో పాటు ఇతర రాజకీయ వత్తిడి కారణంగా ఇరాన్ నుంచి భారీగా చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు ఇతర ఆరు దేశాలకు ప్రత్యామ్నాయ మార్గాలను పదిలం చేసుకొనేలా ట్రంప్ సర్కారు ఆరు నెలల పాటు ఆంక్షల నుంచి మనహాయింపును ప్రకటించింది. ఈ గడువు తాజాగా మే 2వ తేదీతో ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో 'ఇరాన్ ముడి చమురు ఎగుమతులపై ఇప్పటివరకూ ఇస్తున్న రాయితీలను ఇకపై ఇచ్చేది లేదు. మే మొదటివారంతో రాయితీ గడువు ముగిసిపోతుంది' అని శ్వేతసౌధం ప్రకటించింది. దీంతో మన దేశంతో పాటు చైనా, జపాన్, దక్షిణ కొరియా, టర్కీ, తైవాన్, ఇటలీ, గ్రీస్ తదితర దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో మరోమారు చమురు మంటలు ఎగసిపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారత్కు తీరని భారమే..
ఇరాక్, సౌదీ అరేబియా తరువాత భారత్ అత్యధికంగా చమురును ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 2018 జనవరి వరకు భారత్ 18.4 మిలియన్ టన్నుల ముడి చమురును దిగుమతి చేసుకుందంటే ఆ దేశంపై మన దేశం చమురు అవకాశాల కోసం ఎంత ఎక్కువగా ఆధారపడుతోందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఇరాన్ నుంచి దిగుమతులు నిలిపేస్తే భారత్ భారీగా ఇబ్బందిపడే అవకాశం కనిపిస్తోంది. ఆ లోటను మిత్రపక్షాలైన యూఏఈ, సౌదీ అరేబియాతో కలిసి భర్తీ చేస్తామని అమెరికా చెబుతోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు కొరత రాకుండా చూస్తామని హామీ ఇస్తోంది. అయితే ఇది అంత సులువుగా అయ్యే పనికాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇరన్ చమురు వాటా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా పూర్తి స్థాయి చమురు ఉత్పత్తి అంత సులువు కాదని.. ఇందుకు చాలా సమయం పడుతుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఫలితంగా రవాణా ఖర్చులు పెరిగి చమురు ధరలు మండే అవకాశం ఉందన్నది వారి వాదన. దీంతో రానున్న రోజుల్లో భారత్తో సహా వర్థమాన దేశాలకు మళ్లీ చమురు మంట తగిలే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అమెరికా చర్యకు భారత్ వెంటనే స్పందించింది శ్వేతసౌధం చర్య వల్ల కలిగే పరిణామాలను తాము పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నామని.. త్వరలోనే ఈ విషయమై తాము ఒక నిర్ణయం తీసుకోనున్నట్టుగా భారత్ తెలిపింది.
స్టాక్ మార్కెట్లకు మొదలైన సెగ..
ముంబయి: ఇరాన్ నుంచి చమురు దిగుమతుల విషయమై అమెరికా రానున్న రోజుల్లో మరింత కఠినంగానే వ్యవహరించనుందన్న వార్తా కథనాలు సోమవారం స్టాక్ మార్కెట్ల నష్టానికి దారి తీశాయి. రానున్న రోజుల్లో భారత్ చమురు అవసరాల కోసం ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవాల్సి వస్తుందని.. దీంతో చమురు దిగుమతుల బిల్లు తడిచి మోపెడవుతుందన్న వార్తలు మార్కెట్లో చెక్కర్లు కొట్టాయి. దీంతో అమ్మకాల ఒత్తడి పెరగడంతో నిఫ్టీ 11,600కు దిగువకు పడిపోగా.. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్లు నష్టపోయింది. సోమవారం ఉదయం బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ ఫ్లాట్గానే ప్రారంభమైనప్పటికీ.. వెంటనే నష్టాల్లోకి జారుకొంది. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. చివరికి 495 పాయింట్ల నష్టంతో 38,645 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ ఆరంభం నుంచి నష్టాల్లోనే కొనసాగి చివరకు 158 పాయింట్ల నష్టంతో 11,594 వద్ద ముగిసింది. దీనికి తోడు డాలరుతో రూపాయి విలువ మరింతగా పడిపోవడం మార్కెట్ సెంటిమెంట్ను మరింతగా దెబ్బ తీసింది. దీంతో స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను మిగిల్చాయి. ఐటీ తప్ప మిగతా రంగాల షేర్లు నష్టాలను నమోదు చేశాయి. ఇండియాబుల్స్ హౌజింగ్, యస్బ్యాంక్, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐవోసీ షోర్లు నష్టాలను నమోదు చేశాయి. ఫలితంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో మదుపరులు దాదాపు రెండు లక్షల కోట్ల మేర సంపదను కోల్పోయారు.