Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధరలు మరింత మండిపోయే అవకాశం
- అంతర్జాతీయంగా పడిపోనున్న రూపాయి
- పెట్టుబడులకూ విఘాతం తప్పకపోవచ్చు
- గణనీయంగా ఎగిసిపడనున్న ద్రవ్యోల్బణం
- సామాన్యులకు భవిష్యత్తులో తిప్పలే..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే ఏ దేశానికి ఇకపై ఆంక్షల నుంచి మినహాయింపులు ఇవ్వకూడదని అమెరికా తీసుకున్న నిర్ణయం భారత పై భారీగానే ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకొనేందుకు గాను ఇరాన్ నుంచి భారత్ ముడి చమురు దిగుమతులను త్వరలోనే నిలిపివేయనుంది. ఈ విషయమై చమురు శాఖ ఉన్నతాధికారి ఒకరు మంగళవాం మాట్లాడుతూ 'త్వరలోనే ఆ దేశం నుంచి ఆయిల్ దిగుమతిని నిలిపివేస్తాం' అని తెలిపారు. ఇరాన్ నుంచి ముడి చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి(2018-19) 24 మిలియన్ టన్నుల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఇప్పుడు అమెరికా ఆంక్షల నేపథ్యంలో మన దేశం ఈ మొత్తానికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముడిచమురు వేరే దేశాల నుంచి దిగు మతి చేసుకోవాల్సి వస్తుంది. ఇందుకు గాను భారత్ చమురుపై అధికంగానే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఫలితంగా అధిక మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం ఇతర దేశా లకు తరలి పోతుంది. దీంతో రూపాయి విలువ దిగజారుతుంది. తక్కువ మొత్తం లో రిటర్నులు వస్తాయన్న భావనతో విదేశీ మదుపరులు తమ పెట్టుబడులకు మరింత మెరుగైన మార్కెట్లకు తరలించుకుపోయే అవకాశం ఉంది.
భగ్గుమననున్న ధరలు..
అమెరికా నిర్ణయంతో సప్లయి తగ్గి డిమాండ్ పెరగడం మూలంగా త్వరలోనే పీపా ముడి చమురు ధరలు 80 నుంచి 85 డాలర్లకు చేరవయ్యే అవకాశం ఉంద ని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పెరిగిన ధరలు దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశం ఉందని వారు విశ్లేషిస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారత్ లోనూ పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోనున్నాయి. ఈ ప్రభావంతో దేశంలో మరో మారు ధరల పోటు తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ధరలు పెరిగితే దాని ప్రభావం ద్రవ్యోల్బణం రూపంలో ప్రతిబింబించే అవకాశం మెండుగా ఉంది. దీంతో ధరలు పెరిగితే రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ సమ నియంత్రణకు గాను వడ్డీరేట్లను పెంచాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ నిర్ణయంతో మూలధనం సులభంగా లభించదు. మూలధనం కోసం అధికంగా వ్యయం చేయాల్సి వస్తుంది. ఫలితంగా పారిశ్రామిక ప్రగతికి విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కరెంటు ఖాతా లోటుకు రెక్కలు
అమెరికా ఆంక్షల హెచ్చరిక నేపథ్యంలో బ్రెంట్ ఫ్యూచర్స్లో జూన్ డెలివరీకి సంబంధించిన పీపా చమురు ధర మరో 0.6 శాతం మేర పెరిగి 74.51 డాలర్లకు చేరింది. ఇది గత డిసెంబరు ముగింపు నాటికి కేవలం 54.57 డాలర్లుగా ఉంది. అంటే కేవలం కేవలం నాలుగున్నర నెలల్లో పీపా చమురు ధర దాదాపు 37 శాతం మేర పెరిగిందని చెప్పోచ్చు. పీపా ముడి చమురు ధర 10 డాలర్ల మేర పెరిగితే దేశ కరెంటు ఖాతా లోటు జీడీపీలో 0.4 శాతం మేర పెరిగే అవకాశ ఉంది. దీంతో ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణ దెబ్బ తినే అవకాశం ఉంది. వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో ఇంధ నాల వేయిటేజీ 2.3 శాతంగా ఉంది. దీంతో ముడి చమరు ధరల్లో పెరిగే ప్రతి 10 శాతం పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం దాదాపు 20 బేసిస్ పాయింట్ల మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. దీంతో దేశంలో ధరల మంట మరింత పెరిగే అవకాశం ఉంది.
తగిన ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం..
అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేశారు 'ఇండియన్ రిఫైనరీలకు సరిపడినంత ముడి చమురును అందించడానికి మా వద్ద తగిన ప్రణాళిక ఉంది. చమురును ఉత్పత్తి చేస్తున్న ఇతర దేశాల నుంచి ఆ మొత్తాన్ని దిగుమతి చేసుకుంటాం. దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని ఇండియన్ రిఫైనరీలు అన్నింటికీ తగు విధంగా సిద్ధంగా ఉంచాము' అని పేర్కొన్నారు. మే నుంచి రాయితీలు ఎత్తివేస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలో అందుకు సంబంధించిన ప్రణాళికతోసైతం సిద్ధంగా ఉన్నామని పెట్రోలియంశాఖ కూడా ప్రకటించింది. తాజా పరిణామాల నేపథ్యంలో భారత ప్రభుత్వం సౌదీ అరేబియా వద్ద ఉన్న మిగులు చమురు నిల్వలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోందని అధికార వర్గాలు తెలిపాయి.