Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వడ్డీ ఆదాయం 845 కోట్లు
- బ్యాంకుల్లో 8.7టన్నుల బంగారం:తితిదే
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన వెంకటేశ్వర స్వామి సొమ్ము రూ.12,000 కోట్లకు చేరినట్టుగా టీటీడీ అధికారి ఒకరు తెలిపారు. ఈ డిపాజిట్లను టీటీడీ పలు ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్టుగా ఆయన వివరించారు. వీటి నుంచి టీటీడీకి సంవత్సరానికి దాదాపు రూ.845 కోట్ల మేర వడ్డీ ఆదాయం వస్తోందని ఆయన తెలిపారు. దాదాపు 2000 సంవత్సరాల నాటికి తిరుమల తిరుపతి దేవాలయానికి వార్షికంగా వివిధ మార్గాల ద్వారా దాదాపు రూ.3,100 కోట్ల మేర ఆదాయం వస్తోందని ఆయన విశ్లేషించారు. ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి సగటున 2.5 కోట్ల మంది తిరుమల ఆలయాన్ని దర్శించుకుంటున్నట్టుగా ఆయన తెలిపారు. తితిదే వద్ద భక్తులు సమర్పించుకున్న దాదాపు 8.7 టన్నుల స్వచ్ఛమైన బంగారాన్ని, 550 కి.గ్రా బరువైన రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలు ఉన్నాయని ఆయన తెలిపారు భక్తులు సమర్పించే ఆభరణాలను కూడా తితిదే కొంత కాలం తరువాత కరిగించి స్వచ్ఛమైన బంగారంగా మార్చేస్తుందని ఆయన తెలిపారు. తితిదే వద్ద ఉన్న మొత్తం 8.7 టన్నుల బంగారంలో 1,938 కిలోల బంగారం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ వద్ద, 5,387 కిలోల బంగారం భారతీయ స్టేట్ బ్యాంక్ వద్ద డిపాజిట్ చేసి ఉన్నట్టుగా ఆయన తెలిపారు. డిపాజిట్ కాలం ముగియడంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి ఇటీవలే దాదాపు 1,381 కిలోల బంగారం తితిదే ఖజానాకు తాజాగా వచ్చి చేరిందని ఆయన వివరించారు. దీనికి తోడు స్వామివారికి సంబంధించి ఆలయ నిర్వాహకుల వద్ద అత్యంత విలువైన ఆభరణాలు ఉన్నాయని.. వీటిని స్వామివారి నిత్య కైంకర్యాల కోసం ఆలయంలోనే ఉంచుతున్నట్టుగా ఆయన తెలిపారు.