Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ వచ్చే ఏడాది నుంచి డీజిల్ వేరియంట్లో కార్ల ఉత్పత్తిని నిలిపివేయనుంది. 2020 ఏప్రిల్ 1 నుంచి అన్ని మోడళ్లలో డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్టుగా మారుతీ సుజుకీ ఇండియా ఛైర్మన్ ఆర్సీ భార్గవ గురువారం వెల్లడించారు. ప్రస్తుతం దేశీయంగా ఈ సంస్థ అమ్మకాలు జరుపుతున్న కార్లలో డీజిల్ కార్ల వాటా 23 శాతం వరకు ఉంది. ప్రస్తుతం ఎస్-క్రాస్, సియాజ్, వితారా బ్రెజ్జా, డిజైర్, బాలెనో, స్విఫ్ట్ మోడళ్లు డీజిల్ వేరియంట్లోనూ లభిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 తరహా వాహనాలు అరంగేట్రం చేయనున్నాయి. ఈ సాంకేతికతతో డీజిల్ వేరియంట్లో కార్ల ఉత్పత్తి ఖర్చు బాగా పెరగనుందని భార్గవ వెల్లడించారు. బీఎస్-6, డీజిల్ వేరియంట్లో చిన్న కార్ల ధరలు అత్యధికంగా పెరిగే అవకాశం ఉండడంతో దీన్ని వినియోగదారులు భరించే అవకాశం ఉండనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. డీజిల్ వేరియంట్ ధరలు పెరిగితే ఏ కార్ల తయారీ సంస్థా డీజిల్ ఇంజిన్ కార్లను తయారు చేసే సాహసం చేయబోదని భార్గవ స్పష్టం చేశారు.
తగ్గిన నికర లాభం.. డివిడెండ్ రూ.80
మార్చితో ముగిసిన త్రామాసికంలో మారుతీ సంస్థ నికర లాభాలు 4.6 శాతం మేర తగ్గి రూ. 1,795.6 కోట్లుగా నమోదు అయ్యాయి. అంతకు ముందు ఏడాది (2017-18) ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 1,882.1 కోట్లుగా ఉందని మారుతీ సుజుకీ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. 2018-19 నాలుగో త్రైమాసికంలో నికర అమ్మకాలు మాత్రం గత ఏడాదితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.20,737.5 కోట్లుగా నమోదైనట్లు ఎంఎస్ఐ ప్రకటించింది. ఇదే త్రైమాసికంలో కార్ల అమ్మకాలు కూడా కొంతమేరకు తగ్గి 4,58,479 యూనిట్లను విక్రయించామని సంస్థ పేర్కొంది. అదే సమయంలో నికర అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే 6.3 శాతం వృద్ధిని నమోదు చేసి రూ. 83,026.5 కోట్లకు చేరింది. ఈ ఆర్థిక సంవత్సరం(2018-19)లో 4.7 శాతం వృద్ధి నమోదు చేసి 18,62,449 యూనిట్లను విక్రయించగా, 1,08,749 యూనిట్లను ఎగుమతి చేసినట్లు సంస్థ ప్రకటించింది. నికర లాభాలు తగ్గినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరానికిగాను మారుతీ సుజుకీ ఇండియా ఒక్కో షేర్కు రూ. 80 చొప్పున డివిడెండ్ ప్రకటించింది.