Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఈపీఎఫ్పై 8.6% వడ్డీకి సర్కారు సై!
న్యూఢిల్లీ: ఎన్నికల నేపథ్యంలో ఉద్యోగులను ప్రసన్నం చేసుకొనేలా కేంద్రం ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని వెలువరించింది. ఉద్యోగుల భవిష్య నిధిపై (ఈపీఎఫ్) 2018-19 సంవత్సరానికి 8.65% వడ్డీని ఇచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో సంఘటిత రంగంలోని ఆరు కోట్లకు పైగా ఉన్న ఉద్యోగులకు మేలు జరుగనుంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే వడ్డీరేటు స్వల్పంగా పెంచడం గమనార్హం. 'భవిష్యనిధి చందాదారులకు 2018-19కి గాను ఈపీఎఫ్వో నిర్ణయించిన 8.65% వడ్డీరేటుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్ఎస్) ఆమోదం తెలిపింది' అని ఈఫీఎఫ్ అధికారి శుక్రవారం వెల్లడించారు. ఈపీఎఫ్వో అంచనా ప్రకారం 8.65% వడ్డీ ఇచ్చినా రూ.151.67 కోట్లు మిగులు సంస్థకు సమకూరనుంది. అదే 8.70% అయితే రూ.158 కోట్లు లోటు ఏర్పడుతుందని అధికారులు సర్కారుకు వెల్లడించడంతో ఆర్థిక శాక ఈ దిశగా నిర్ణయం తీసుకుందని సమాచారం. భవిష్యనిధిపై 2017-18లో 8.55% ఉన్న వడ్డీరేటును 2018-19లో 8.65 శాతానికి పెంచారు. అయితే 2015-16లో 8.8 శాతంగా ఉన్న ఈపీఎఫ్ వడ్డీ రేటును కేంద్రం 2016-17లో 8.65 శాతానికి తగ్గించడం గమనార్హం. ఆ తరువాత దీనిని 8.55 శాతానికి చేర్చింది. ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో సర్కారు మళ్లీ దీనిని 8.65 శాతానికి చేర్చడం విశేషం.