Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జెట్ ఎయిర్వేస్ను నేలకొదిలేసిన సంస్థ ఫౌండర్
- సంస్థకు క(న)ష్టం వస్తే వ్యూహాత్మక మౌనమేంటి..!
- వ్యవస్థాపకుడి తీరును నిలదీస్తున్న ఉద్యోగులు..
- సంస్థ ఎదుగుదలకు గతంలో గట్టిగా లాబీయింగ్
- ప్రభుత్వ నిబంధనలు ఆసరగా వేల కోట్ల సంపాదన
- దేశీయంగా పోటీ సంస్థలెదగకుండా కీలక ఎత్తులు..
- ఇకపై ఆయన ప్రమేయమే వద్దంటున్న బిడ్డర్లు..!
ఆర్థికంగా న(క)ష్టాల్లోకి కూరుకుపోయి.. నింగికెగురలేక నేలకే పరిమితమైన జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రస్తుత దీన పరిస్థితికి ఆ సంస్థ వ్యవస్థాపకుడు, మాజీ చైర్మెన్ నరేశ్ గోయలే ప్రధాన కారణమన్న విమర్శలు వినవస్తున్నాయి. దేశీయ విమానయాన రంగంలో రారాజుగా ఉన్న ఎయిరిండియాకు పోటీగా జెట్ ఎయిర్వేస్ను నిలిపేందుకు దేశంలో మరో పోటీసంస్థ అంటూ ఎదగకుండా చూసేందుకు గాను ఆయన గతంలో వ్యవస్థలను బాగా ప్రభావితం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. వ్యవస్థల్ని తమకు అనుకూలంగా చేసుకొన్న గోయల్ సర్కారు నుంచి కీలక నిర్ణయాలను తెప్పించుకొని లబ్ధి పొందేవారన్న విమర్శలూ వినవస్తున్నాయి. దేశ విమాయాన రంగం, విదేశీ పెట్టుబడుల బోర్డు నుంచి కీలక అనుకూల నిర్ణయాలు వచ్చేలా లాబీయింగ్ చేస్తూ వాటిని జెట్ విస్తరణకు ఉపయోగించుకొని వేల కోట్లను వెనుకేసుకున్నారన్న విమర్శలు వినవస్తున్నాయి. తాజాగా జెట్ పరిస్థితులు చేజారడం.. ఆర్థికంగా జెట్ కుదేలవడంతో గోయల్ జెట్ ఎయిర్వేస్ సంస్థను తిరిగి పట్టాలెక్కించే బాధ్యత గాలికొదిలేసి లండన్కు వెళ్లిపోయారు. సంస్థను రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ప్రభుత్వమే గట్టేకించాలంటూ ఆయన మెల్లిగా విదేశాలకు జారుకున్నారు. దీంతో రెక్కలు ముక్కలు చేసుకొని జెట్ ఎయిర్వేస్ను ఉన్నత స్థాయికి చేర్చిన ఉద్యోగులు రోడ్డున పడ్డారు. సంస్థ, తమ భవిష్యత్తు ఏమిటో తేల్చుకోలేక రాష్ట్రపతితో పాటు ప్రధాని, హోంమంత్రి, రాహుల్ గాంధీలకు లేఖలు రాసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. తమ కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక తోటివారితో కలిసి కన్నీరు పెట్టుకుంటున్నారు
టాటాలు పోటీగా రాకుండా..
జెట్ ఎయిర్వేస్ ప్రారంభమైన 1994లో సంస్థలో నరేశ్ గోయల్కు 60% వాటా ఉండేది. మిగతా వాటాలో 20% షేరు గల్ఫ్ ఎయిర్, 20% కువైట్ ఎయిర్వేస్ చేతుల్లో ఉండేంది. అప్పట్లో ఉన్న ప్రభుత్వ నిబంధన దేశీయ విమానయాన సంస్థలో విదేశీ విమానయాన సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు గాను అనుమతించేవి. ఈ నిబంధనను గోయల్ పూర్తిస్థాయిలో వాడుకొని లబ్ధిపొందారు. ఇదే నిబంధన అనుగుణంగా దేశీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టాలనుకున్న టాటా గ్రూపు ఎయిర్లైన్స్ ప్రారంభం కాకుండా నరేశ్ గోయల్ అప్పట్లో చక్రం తిప్పారన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో టాటా గ్రూపు సింగపూర్ ఎయిర్లైన్స్తో కలిసి దేశీయంగా విమానయాస సంస్థను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేసింది. దీనిని గమనించిన గోయల్ టాటా ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు గాను ప్రభుత్వ పాలసీలోనే మార్పులు చేయించారు. దేశీయ సంస్థల్లో విదేశీ విమాయాన సంస్థలు పెట్టుబడులు పెట్టకుండా అప్పట్లో నిషేధాజ్ఞలను ప్రభుత్వ వర్గాలతో ప్రకటింపజేశారు. దీంతో టాటా ప్రయత్నం విఫలమైంది. దీనికి తోడు జెట్ నుంచి కువైట్ ఎయిర్వేస్, గల్ఫ్ఎయిర్ సంస్థలు తన వాటాను వెనక్కితీసుకవాల్సి వచ్చింది. అయితే పోటీ సంస్థను నిలవరించేందుకు గాను గోయల్ ఆయా సంస్థలకు బలవంతంగానే గుడ్బై చెప్పారు. ఈ కఠినమైన నిబంధన సెప్టెంబరు, 2012 వరకు అమలులో ఉంది.
కింగ్ఫిషర్ నిష్కమణతోనూ..
దేశీయంగా జెట్ ఎయిర్వేస్ సంస్థకు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్ పెద్ద పోటీగా మారింది. 2005లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ సంస్థ 2010 నుంచి నష్టాలలోకి జారుకుంది. 2012లో ఈ సంస్థ నేల వాలిపోయింది. దీంతో అదే సంస్థ పౌరవిమానయాన సంస్థ డైరెక్టర్ జనరల్ కింగ్ ఫిషర్ లైసెన్స్ను రద్దు చేశారు. కింగ్ఫిషర్ సంస్థ విఫలం కావడంతో మేలుకున్ను ప్రభుత్వం దేశీయ విమాన సంస్థలను ఆదుకొనేందుకు గాను నింబంధనలను మార్చాలని నిర్ణయించింది. దేశీయ విమాన సంస్థలో 49 శాతానికి సమానంగా విదేశీ పెట్టుబడులను అనుమతించాలని నిర్ణయించింది. నరేశ్ గోయల్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనను కూడా తనకు పూర్తి అనుకూలంగా మార్చుకొని లబ్ధి పొందారనే విమర్శలు ఉన్నాయి. ఇందులో భాగంగా సంస్థలో 24 శాతం వాటాను ఎతిహాద్ ఎయిర్లైన్స్కు 379 మిలియన్ డాలర్లకు విక్రయించారు. అయితే ఈ నిబంధన కొన్ని నెలల ముందు వెలువడి ఉంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడేది కాదు. ఇదే సమయంలో 2013లో వెలువడిన నిబంధనలు అప్పటికే సేవలు నిర్వహిస్తున్న సంస్థల్లో మాత్రమే పెట్టుబడులుపెట్టేందుకు అనుమతించాయి. ఇదే సమయంలో కొత్తగా ముందుకొస్తున్న విమాయన సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు రాకుండా ఆ నిబంధనలు అడ్డుకున్నాయి. ఈ నిబంధనలు అమలులో ఉండగానే అప్పటికే విమాన సంస్థలుగా రిజిస్టరయిన విస్తారా, ఎయిర్ ఏషియా సంస్థలకు ప్రభుత్వ లైసెన్సులు లభించాయి. ఈ సంస్థలు భారత విమానయాన సంస్థలు కానప్పటికీ అనుమతులివ్వడాన్ని కొందరు ఆక్షేపిస్తూ కోర్టుకెక్కారు. అయితే ఈ విషయం ఇంకా న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది.
కలిసొచ్చిన 5 బై 20 నిబంధన..
జెట్ ఎయిర్వేస్ సంస్థ జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ మార్గాలకు విస్తరించేందుకు కూడా ప్రభుత్వ నిబంధనలు ఎంతగానో దోహదం చేశాయి. అప్పటి వరకు ఏ సంస్థ అయినా అంతర్జాతీయ సర్వీసులను నిర్వహించుకొనే వీలుండగా.. 2004 నుంచి సర్కారు 5 బై 20 నిబంధనను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం ఏదైన విమానయాన సంస్థ అంతర్జాతీయ సర్వీసులను నడపాలంటే కనీసం దేశీయంగా ఐదేండ్లు సర్వీసులు నడిపిన అనుభవం ఉండాలని లేదా కనీసం 20 ఎయిర్క్రాఫ్ట్లను కలిగి ఉండాలనే నిబంధనను తీసుకువచ్చింది. దీంతో కొత్త సంస్థలు విదేశాలకు విమానాలను నడపకుండా అడ్డుపుల్ల పడింది. ఈ నిబంధనను ఆసరగా చేసుకొని జెట్ సంస్థ ఎయిరిండియాకు పోటీగా విదేశాలకు తమన సర్వీసులను విస్తరిం చేందుకు. లాభాలను గడించేందుకు ఎంతగానో దోహాదం చేసింది. దీనికి తోడు జాతీయంగా ఉన్న వివిధ మార్గాల్లో చిన్న సైజు విమానానాలను తీసుకురావాలని జెట్ నిర్ణయించింది.ఇదే సమయంలో సర్కారు ఒక నిర్ణయం తీసుకుంటూ చిన్న విమానాల పార్కింగ్ చార్జీలను, ఇంధనపై పన్నును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ అంశం జెట్ సంస్థకు నరేశ్ గోయల్కు ఎంతగానో కలిసి వచ్చింద. సంస్థ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఆయా నిర్ణయాలు ఎంతగానే మేలు చేశాయి.
గోయల్ గోబ్యాక్ అని నినదించిన బిడ్డర్లు..
జెట్ ఎయిర్వేస్ సంస్థ చైర్మెన్ పదవి నుంచి రుణదాతలు తప్పించడంతో ఇష్టం లేకున్నా సీటును వదులుకున్న గోయల్ తన సంబంధికుల సంస్థలతో కీలక వాటాను మళ్లీ చెజిక్కించుకొనేలా ఎత్తుగడ వేశారు. దీని ద్వారా సంస్థ నుంచి మరింత గరిష్ట స్థాయిలో లబ్ధి పొందాలన్నది ఆయన ప్లాన్. దీనిని గమనించిన మరో ప్రమోటర్ సంస్థ ఎతిహాద్ వర్గాలు గోయల్ ఆసక్తివ్యక్తీకరణను (ఈవోఐ) అడ్డుకోవాలని భావించాయి. దీంతో వారు రుణదాతలను గోయల్ను బిడ్డింగ్ ప్రక్రియకు దూరంగా ఉంచాలని కోరారు. లేదంటే తామే ఈ ప్రక్రియ నుంచి వైదొలుగుతామంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో రుణదాతల బృందం గడువు గోయల్కు చెందిన కంపెనీలు దాఖలు చేసిన ఆసక్తివ్యక్తీకరణను (ఈవోఐ) అంగీకరించలేదు. బిడ్డింగ్ ప్రక్రియకు కూడా ఆయనను దూరంగా ఉంచాయి. ఈ క్షణంలో కంపెనీని నిలబెట్టేందుకు గోయల్ తన అనుభవాన్ని రంగరిస్తూ రుణదాతలకు బాసటగా నిలవాల్సింది పోయి.. బ్రిటన్కు పరిమితం కావడం పట్ల కూడా విమర్శలు వినవస్తున్నాయి.