Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత వైమానికి రంగంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే ఈ విభాగంలో కింగ్ఫిషర్, జెట్ ఎయిర్వేస్ సంస్థలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ దుకాణం మూసేయగా తాజాగా సోమవారం ప్రభుత్వరంగ హెలికాప్టర్ సంస్థ పవన్ హన్స్ కూడా తాము ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నట్టు ఒక సర్క్యూలర్లో పేర్కొంది. కేంద్రం, ఓఎన్జీసీ జాయింట్ వెంచర్ నిర్వహిస్తున్న పవన్ హన్స్ గురువారం విడుదల చేసిన సర్క్యూలర్లో సంస్థ ఆర్థిక పరిస్థితులు సరిగాలేదని, సంస్థ భవితవ్యమూ అగమ్యగోచరంగా ఉన్నదని పేర్కొంది. అందువల్ల ఉద్యోగుల ఏప్రిల్ నెల జీతాలను చెల్లించలేకపోతున్నట్టు వివరించింది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో సంస్థ రాబడి తగ్గుముఖం పట్టిందని, రూ.89 కోట్ల నికర నష్టాలను చవిచూసిందని తెలిపింది. ప్రస్తుత వ్యాపార పరిస్థితుల ప్రకారం.. సంస్థ ఖర్చులకు, రాబడికి మధ్య పొంతన కుదరడం లేదని వివరించింది. ముఖ్యంగా సిబ్బందిపై వ్యయంలో ఈ తారతమ్యం మరింత ఎక్కువగా ఉందని పేర్కొంది. ఆర్థిక అస్థిరతతో కస్టమర్ల దగ్గర రూ. 230 కోట్లు పోగుపడిందని, పలువిభాగాల్లో తక్షణమే చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిపింది. ఈ క్లిష్టమైన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది ఏప్రిల్ నెల వేతనాలను వాయిదా వేయనున్నట్టు పేర్కొంది. అయితే అందులో 60 శాతం పొందే వరకు నేరుగా ప్రొడక్షన్లో భాగస్వాములైన ఉద్యోగులకు జీతాలను ఇవ్వనున్నట్టు వివరించింది. ఖర్చులను తగ్గించేందుకు మరిన్ని మార్గాలను అన్వేషించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతం పవన్ హన్స్లో 46 హెలికాప్టర్లు ఉన్నాయి.