Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన జెట్ ఉద్యోగ సంఘాలు
- బయటి వారి అండ ఉందని వెల్లడి
- యూఏ పునరుద్ధరణ ఆదర్శమట..
- బిడ్ను అంగీకరించాలంటూ విజ్ఞప్తి
- ఈ మేరకు రుణదాతలకు లేఖాస్త్రం
న్యూఢిల్లీ: ఆర్థిక కష్టాల కారణంగా నిర్వహణ మూలధనం లేక తాత్కాలికంగా మూతపడిన జెట్ ఎయిర్వేస్ను మళ్లీ తెరిపించేందుకు సంస్థలోని ఒక వర్గం ఉద్యోగులు అనూహ్యంగా ముందుకు వచ్చారు. జెట్ను కాపాడుకొనేందుకు గాను వీరు, ఇతర పెట్టుబడిదారులతో కలిసి ఒక బృందంగా ఏర్పడ్డారు. దాదాపు రూ.7000 కోట్ల వరకు నిధులను సమీకరిస్తామని వెల్లడించారు. దీనికి కొనసాగిం పుగా బిడ్ను కూడా దాఖలు చేయనున్నామని వారు తెలిపారు. తమ బిడ్ను రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆమోదించాలని వారు కోరారు. ఇదే విషయమై తమ భవిష్యత్తు కార్యాచరణను వెల్లడిస్తూ ఉద్యోగులు ఎస్బీఐ చైర్మెన్ రజనీష్ కుమార్కు ఒక లేఖ రాశారు.
అందరితో చర్చించాకే నిర్ణయం..
సంస్థ ఉద్యోగులందరూ కలిసి ఒక్క తాటిపైకి వచ్చి సంస్థను కాపాడుకోవాలని నిర్ణయించామని వారు తెలిపారు. ఇందులో భాగంగా వివిధ ఉద్యోగుల బృందాలు, సహచరులు. సంస్థలోని మేనేజ్మెంట్ విభాగంలో గతంలో పని చేసిన ఉద్యోగులతో తాము చర్చలు జరిపామని వీరు తమ లేఖలో తెలిపారు. ఈ చర్చల అనంతరం ఇతర బయటి పెట్టుబడిదారులతో కలిసి జెట్ ఎయిర్వేస్ కు బిడ్ను దాఖలు చేసి సంస్థను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని నిర్ణయిం చామని వారు తెలిపారు. 1994లో యునైటెడ్ ఎయిర్లైన్స్ (యుఏ) సంస్థను కాపాడుకొనేందుకు గాను ఆ సంస్థ ఉద్యోగులు ఇలాంటి సంస్థ పరిరక్షణ చర్యలతో ముందుకు వచ్చిన సంగతిని వారు తమ లేఖలో ఉదహరించారు. ఎస్బీఐకి పంపిన ఈ లేఖలో జెట్ ఎయిర్వేస్ కార్యకలాపాల విభాగం ఉపాధ్యక్షుడు పి.పి. సింగ్, సోసైటీ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ కార్యదర్శి అశ్విన్ త్యాగీ, జెట్ ఎయిర్క్రాఫ్ట్ మెయింటనెన్స్ ఇంజినీర్స్ వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశీష్ కుమార్ మహంతిలు తమ చేవ్రాలు చేశారు. సంస్థ కష్టాలకు కారణమైన వివిధ అంశాలను తాము అధ్యయనం చేశామని.. వీటిని అధిగమించి సంస్థను నిలబెట్టుకొనేందుకు గాను తాము వ్యూహాత్మకంగా ఏకపక్ష బిడ్ దాఖలు చేయాలని భావిస్తున్నట్టుగా ఉద్యోగ సంఘాల వారు తెలిపారు. సంస్థను తమకు అప్పగిస్తూ మళ్లీ పూర్వవైభవాన్ని సాధించుకొనే దిశగా కృషి చేస్తామని వారు అన్నారు.
ఇతర పెట్టుబడుల ద్వారా 3000 కోట్లు
ఉద్యోగుల గ్రూపునకు చెందిన ఐదేండ్ల ఎంప్లాయిస్ స్టాక్ ఓనర్షిప్ ప్రోగ్రామ్ (ఈఎస్వోపీ) ద్వారా దాదాపు రూ.4000 కోట్లు, ఇతర బయటి పెట్టుబడిదారుల వద్ద నుంచి దాదాపు రూ.3000 కోట్ల వరకు సమీకరించగలమని వారు తమ లేఖలో తెలిపారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్వేస్ను నిలబెట్టేందుకు గాను ఆ సంస్థలో కీలక వాటాను విక్రయించేందుకు రుణదాతల బృందం ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. జెట్లో కీలక వాటాను చేజిక్కించుకొనేందుకు గాను ఎతిహాద్, టీపీజీ అండ్ ఎన్ఐఐఎఫ్ సంస్థలు ఇప్పటికే తమ ఆసక్తిని వ్యక్తీకరించాయి. ఈ బిడ్ తుది విజేతలను మే 10న అధికారికంగా ప్రకటించనున్నారు. ఇందుకు గాను రుణదాతలు విమానాల డీరిజిస్ట్రేషన్, ఎయిర్పోర్టు స్లాట్ల పునర్ కేటాయింపు ప్రక్రియలను వెంటనే రిజర్వు చేయాలని వారు కోరారు. లేదంటే కంపెనీని నిలబెట్టుకొనేందుకు ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోమని వారు హెచ్చరించారు.