Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలోని స్తబ్దతకు అద్దంపడుతూ ఏప్రిల్ మాసంలో భారత వాణిజ్య లోటు అయిదు నెలల గరిష్టానికి చేరింది. గత ఏప్రిల్ మాసంలో దేశ ఎగుమతులు, దిగుమ తులకు మధ్య వ్యత్యాసం 15.33 బిలియన్ డాలర్లకు చేరింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో దేశ వాణిజ్య లోటు 13.72 బిలియన్ డాలర్లుగా ఉంది. గత నెలలో ఎగుమతులు 0.64 శాతం మేర ఎగిసి 26 బిలియన్ డాలర్లకు చేరింది. ఇదే సమయంలో దిగుమతులు 4.5 శాతం మేర పెరిగి 41.4 బిలియన్ డాలర్లకు చేరువైంది. గత ఏప్రిల్ మాసంలో చమురు దిగుమతులు 9.26 శాతం మేర పెరిగి 11.38 బిలియనన్ డాలర్లకు, చమురేతర దిగుమతులు 2.78 శాతం మేర పెరిగినట్టుగా ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. గత ఏప్రిల్ మాసంలో పసిడి దిగుమతులు 54 శాతం మేర పెరిగి 3.97 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఏప్రిల్ మాసంలో రికార్డు స్థాయిలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులు రికార్డు స్థాయిలో 1.44 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకు ముందు మార్చి మాసంలో ఎగుమతులు ఐదు మాసాల గరిష్టాన్ని తాకి 11 శాతానికి చేరుకున్నాయి. ఔషధాలు, రసాయనాలు, ఇంజినీరింగ్ రంగంలోని ఉత్పత్తుల కారణంగా మార్చిలో రికార్డు స్థాయిలో ఎగుమతులు నమోదయ్యాయి. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య యుద్ధం క్రమంగా ముదురుతూ వస్తున్న వేళ అంతర్జాతీయ వాణిజ్యంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయనీ ఈ ప్రభావం దేశీయ ట్రేడ్పైనా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.