Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముందుకొచ్చిన డార్విన్ ప్లాట్ఫాం గ్రూపు
- రూ.14,000 కోట్ల సొమ్ముతో రంగంలోకి
- రుణాలను, బకాయిల్నీ చెల్లిస్తామని వెల్లడి
- ఎస్బీఐ క్యాప్ అధికారులతో సమావేశం..
- స్పష్టత వచ్చాక త్వరలోనే ప్రకటన: సీఈవో
- హిందుజా గ్రూపు వైపు ఎతిహాద్ చూపులు...
న్యూఢిల్లీ: ఆర్థిక ఇబ్బందులతో తాత్కాలికంగా మూతపడిన జెట్ ఎయిర్వేస్ సంస్థలో కీలక వాటా చేజిక్కించుకొనేందుకు డార్విన్ గ్రూపు ముందుకు వచ్చింది. జెట్ ఎయిర్వేస్లో కీలక వాటాను సొంతం చేసుకొనేందుకు గాను షరతులు లేని ఆర్థిక బిడ్ను దాఖలు చేసిన సంస్థల్లో డార్విన్ ఒకటి. మొత్తంగా రూ.14,000 కోట్ల మేర నిధులను చెల్లించి కీలక వాటాను చేజిక్కించుకోవాలని ఈ సంస్థ ఉవ్విల్లూరుతోంది. దీనికి సంబంధించి ఆ సంస్థకు చెందిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం రుణదాతల బృందానికి సారథ్యం వహిస్తున్న ఎస్బీఐ క్యాపిటల్ అధికారులతో బుధవారం సమావేశమైంది. డార్విన్ ప్లాట్ఫాం గ్రూపు ఆఫ్ కంపెనీస్ చమురు, సహజ వాయువు, స్థిరాస్తితో పాటు పలు ఇతర రంగాలలో భారీగా పెట్టుబడులు కలిగి ఉందని ఆ సంస్థ సీఈవో రాహుల్ గన్పులే తెలిపారు. తాము జెట్ ఎయిర్వేస్లో కీలక వాటాతో పాటు.. ఆ సంస్థ గతంలో చేసిన రుణాలు, ఇతర బకాయిలను కూడా చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికతోనే తాము ముందుకు వచ్చామని ఆయన పేర్కొన్నారు. జెట్ కొనుగోలు కోసం తమ సంస్థ ఈ నెల 8న బిడ్ దాఖలు చేసినట్టుగా వివరించారు. రుణదాతల వాటా విక్రయానికి గాను ఎస్బీఐ ఈ నెల 8 నుంచి 10 వరకు బిడ్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. జెట్ సంస్థకు ఉన్న ఆస్తులు, అప్పుల గురించి సవివరంగా అర్థం చేసుకొనేందుకు ఎస్బీఐ క్యాప్ అధికారులు తమను చర్చలకు ఆహ్వానించారని రాహుల్ వివరించారు. జెట్ ఎయిర్వేస్ సంస్థ మూతపడే సమయానికి ఆ సంస్థ రుణభారం దాదాపు రూ.8000 కోట్ల వరకు ఉంది. అయితే సంస్థలో కీలక వాటా కొనుగోలుకు ఎతిహాద్ సంస్థ షరతులతో కూడిన బిడ్ను దాఖలు చేయగా.. మరో రెండు సంస్థలు షరతులేమి లేకుండానే ఫెయిర్ బిడ్లను దాఖలు చేశాయి. వీటిని ఈ నెల 13న పరిశీలించింది. ఫైనాన్షియల్ బిడ్ను దాఖలు చేయడానికి ముందు తమ సంస్థ అన్ని అంశాలను పరిశీనలోకి తీసుకుందని రాహుల్ తెలిపారు. జెట్ ఎయిరవేస్ ఆస్తులు, అప్పులకు సంబంధించి రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్, ఇతర పబ్లిక్ సోర్సుల వద్ద చాలా తక్కువగా సమాచారం అందుబాటులో ఉందని.. ఈ నేపథ్యంలో తాము ఎస్బీఐ క్యాప్ను మరింత సమాచారం కోరినట్టుగా ఆయన వివరించారు.
హిందుజాలతో ఎతిహాద్ చర్చలు..
జెట్ ఎయిర్వేస్ సంస్థలో కీలక వాటాను కొనుగోలు చేసేందుకు బిడ్ను దాఖలు చేసిన ఎతిహాద్ సంస్థ ఇందుకు గాను హిందుజాల సంస్థతో కలిసి ముందుకు సాగాలని యత్నిస్తున్నట్టుగా సమాచారం. వాటా కొనుగోలు కొనుగోలు విషయమై ఎతిహాద్ సంస్థ సొంతంగా వెల్లకూడదని.. భారత సంతతికి చెందిన వ్యాపారావేత్తలతో ముందుకు సాగాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సంస్థ ప్రతినిధులు హిందుజాలతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. అయితే వారి నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ రాలేదని తెలుస్తోంది.