Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దశాబ్దం తరువాత భారీ లాభం
- 1,434 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- రికార్డు స్థాయిలో 39,365 ముగింపు..
- 422 పాయింట్లు మేర లాభపడిన నిఫ్టీ
- ఒకే రోజు రూ.5.27 లక్షల కోట్ల లాభం
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం తారా జువ్వలా ఎగిసి.. రికార్డు లాభాలను నమోదు చేశాయి. దేశంలో భాజపా కూటమి మరోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని దీంతో భారత్లో స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రానుందంటూ ఎగ్జిట్పోల్స్ అంచానాలను వెల్లడించడం మదుపరుల సెంటిమెంట్ను పెంచాయి. దీనికి తోడు రూపాయి విలువ బలపడడం, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో ఉంచుకొని పలు దేశాల కేంద్రీయ బ్యాంక్లు వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడంతో పాటు అమెరికా ఫెడ్ కూడా వడ్డీరేట్ల పెంపుపై కొంత దూకుడు తగ్గించడం భారత మార్కెట్లకు కలిసొచ్చింది. మరోవైపు వాణిజ్య యుద్ధం నేపథ్యంలో చైనా వాణిజ్య చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించడం మార్కెట్లలో జోష్ను పెంచింది. దీంతో మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. సూచీల్లోని ప్రధాన షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. బ్యాంక్ నిఫ్టీ పదిసెషన్లలో ఏకంగా 10శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లు దూకుడుగా ఉన్నాయి. విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఈ ర్యాలీని దూకుడుగా నడిపించారు. ఎఫ్ఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.30వేల కోట్లను మార్కెట్లలోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే రూ.1,482.99 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు. దీంతో సెన్సెక్స్ 1,434 పాయింట్లు లాభపడి 39,365 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు లాభపడి 11,830 వద్ద ముగిశాయి. దీంతో మార్కెట్లు పదేళ్ల తర్వాత అతిభారీ లాభాలతో ముగిశాయి. సోమవారం ర్యాలీని బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు నడిపించాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కదలాడాయి. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 4శాతం లాభపడింది. ఇక ఆటో ఇండెక్స్ లాభాలు కూడా 4శాతంగా నమోదయ్యాయి. సెన్సెక్స్లోని ఎస్బీఐ 8శాతం, యస్బ్యాంక్ 6శాతం, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్,ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, మారుతీ, టాటా స్టీల్, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండిస్టీస్లు 4 నుంచి 5 శాతం వరకు లాభపడ్డాయి. రూపాయి విలువ రెండు వారాల్లో అత్యధిక స్థాయికి చేరింది. 69.36 మార్కును తాకింది. ఎన్డీఏ మెజార్టీ కనుక 300 మార్కును దాటితే ర్యాలీ మే 23 తర్వాత కూడా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. వ్యవస్థలో నగదు ప్రవాహ పరిస్థితి, కార్పొరేట్ లాభాలు, ప్రపంచ వ్యాప్త పరిస్థితులు వంటి అంశాలను దష్టిలోపెట్టుకొని నేడు మార్కెట్ జోరు కొనసాగింది. స్థిరమైన ప్రభుత్వం వస్తే ఆటో, ఇన్ఫ్రా, క్యాపిటల్ గూడ్స్, బ్యాంకింగ్ రంగాలు మెరుగైన పనితీరుకనబరుస్తాయని మార్కెట్ వర్గాలు భావించాయి. అందుకే ఆయా రంగాల షేర్లు నేడు పరుగులు తీశాయి.
దౌడు తీసిన మార్కెట్లు..!
నరేంద్రమోదీ మరోసారి ప్రధాని పీఠాన్ని అధిరోహిస్తారంటూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడించడంతో దేశీయ మార్కెట్లు సోమవారం అతి భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. దీంతో మదుపర్ల సంపద కూడా ఊహించని విధంగా పెరిగింది. కేవలం మార్కెట్ ప్రారంభమైన ఒకే ఒక్క నిమిషంలోనే మదుపర్లు రూ. 3.18లక్షల కోట్లు ఆర్జించారు. సోమవారం నాటి ట్రేడింగ్ను సూచీలు ఫుల్ జోష్తో ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ 900 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్ను మొదలుపెట్టింది. దీంతో మార్కెట్ ఆరంభమైన 60 సెకన్లలోనే బీఎస్ఈలోని అన్ని కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూ. 3.18లక్షలు పెరిగి రూ. 1,49,76,896కోట్లకు చేరింది. శుక్రవారం నాటి ముగింపులో ఈ కంపెనీల మార్కెట్ విలువ మొత్తంగా రూ.1,46,58,710కోట్లుగా ఉంది.
దశాబ్దం తరువాత రెండో ర్యాలీ..
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ట్రేడింగ్ ఆరంభం నుంచే అతి భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లు ఎగబాకి మళ్లీ 39వేల మైలురాయిని దాటింది. 2009 మే 18 తర్వాత సెన్సెక్స్ ఒక రోజు సెన్సెక్స్ ఇంత భారీ ర్యాలీ నమోదు చేయడం ఇదే తొలిసారి. పదేళ్ల క్రితం 2009 మే 18న సెన్సెక్స్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒక్క సెషన్లో రికార్డు స్థాయిలో 2,110 పాయింట్లు ఎగబాకింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం మార్కెట్లలో సరికొత్త హుషారు నింపింది. దీంతో ఆ రోజున సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ ఒక రోజులో 2000 పాయింట్లు లాభపడటం మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. ఆ తర్వాత 2015 జనవరి 15న సెన్సెక్స్ 729 పాయింట్లు లాభపడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం మార్కెట్ సెంటిమెంట్ను బలపర్చింది. ఆ మరుసటి ఏడాది 2016 మార్చి 1న 777 పాయింట్లు ఎగబాకింది. కేంద్ర బడ్జెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు అప్పట్లో మార్కెట్లకు జోష్ను నింపాయి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అంటే 2018 అక్టోబరు 12న 732 పాయింట్లు లాభపడింది. సోమవారం మార్కెట్ భారీ ర్యాలీతో మదుపరుల సంపద దాదాపు రూ.5.27 లక్షల కోట్ల మేర పెరిగింది. అనూహ్య ర్యాలీ నేపథ్యంలో బీఎస్ఈలో లిస్టడ్ కంపెనీల మార్కెట్ విలువ సోమవారం రూ.1,46,58,709 కోట్ల నుంచి రూ.1,51,85,506 కోట్లకు పెరిగింది. గతంలో మార్కెట్ విలువ ఎన్నడూ ఇంత భారీస్థాయిలో పెరిగింది లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
భారీగా పెరిగిన అదానీ షేర్లు
అదానీ కంపెనీల షేర్లు ఇంట్రాడేలో 17 శాతం మేర పరుగులు పెట్టాయి. ఎస్బీఐ, యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్అండ్టీ తదితర షేర్లు భారీగా లాభపడ్డాయి. ఇక ఎఫ్ఐఐలతో పాటు సంస్ధాగత ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లకు దిగడం మార్కెట్ సెంటిమెంట్ను ప్రభావితం చేసిందని విశ్లేషకులు పేర్కొన్నారు. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్, ఇండియాబుల్స్ హైసింగ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, యస్ బ్యాంక్, గ్రాసి మ్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు భారీ లాభాల్లో ముగి శాయి. అదానీ పోర్ట్స్, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు 11 శాతం ర్యాలీ చేశాయి. ఎస్బీఐ 8 శాతం పరుగులు పెట్టింది. అదేసమయంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జీ ఎంటర్టైన్మెంట్, బజాజ్ ఆటో, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. రూపాయి పెరగడంతో ఐటీ స్టాక్స్ పడిపోయాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేరు 5 శాతానికి పైగా నష్టపోయింది.