Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో రెండు చిన్న బ్యాంకులు కూడా
- ప్రక్రియ ప్రారంభం
- వచ్చే మూడు నెలల్లోనే నిర్ణయం
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీిఎన్బీ) త్వరలో మూడు బ్యాంకులను స్వాధీనం చేసుకోనుందని తెలుస్తోంది. ఈ జాబితాలో హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్రా బ్యాంకుతో పాటు అలహాబాద్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ ఉన్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియను పీిఎన్బీ ప్రారంభించిందని రాయిటర్స్ ఓ కథనంలో తెలిపింది. వచ్చే మూడు నెలల్లోనే దీనిపై నిర్ణయం వెలుపడనుంది. అయితే ఇది విలీనమా,,?, స్వాధీనమా..? స్పష్టత రావాల్సి ఉంది. అప్పుల ఒత్తిడిలో ఉన్న బ్యాంకులను ఏకీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ యోచనలో భాగంగా ఈ ప్రక్రియ జరుగుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న రూ.9 లక్షల కోట్ల మొండి బాకీలను తగ్గించాలనే ప్రయత్నంతో ఈ స్వాధీనాలు చేపడుతున్నట్లు ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుత ఏడాది ప్రారంభంలో దేనా బ్యాంకు, విజయా బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడాలను విలీనం చేయడం ద్వారా ఎస్బీఐ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంకుగా ఇవి అవతరించాయి. ఈ మూడు బ్యాంకుల విలీనం ఏప్రిల్ ఒక్కటో తేది నుంచి అమల్లోకి వచ్చింది. కాగా ఈ మూడు బ్యాంకుల ఏకీకరణతో 9500 శాఖలు, 13,400 ఏటీఎంలు, 85,000 మంది ఉద్యోగులు ఒక్క గొడుగు కిందకు వచ్చారు. గతేడాది ఐడీబీఐ బ్యాంకును దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ ఎల్ఐసీి స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అప్పుల ఊబిలో చిక్కుకుపోయిన ఐడీబీఐ బ్యాంకును మోడీ సర్కార్ ఎల్ఐసీకి కట్టబెట్టింది. కాగా 2017లో స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఆ బ్యాంకు ఐదు అసోసియేట్ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకును విలీనం చేశారు.
మంగళవారం సెషన్లో ఎన్ఎస్ఇలో పీఎన్బీ షేర్ 2.55 శాతం తగ్గి రూ.86.10 వద్ద ముగిసింది. అలహాబాద్ బ్యాంకు షేర్ 2.6 శాతం కోల్పోయి రూ.45.15 వద్ద, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ సూచీ 1 శాతం కోల్పోయి రూ.95.20 వద్ద ముగిసింది. ఈ విలీనాలపై కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ వర్గాలు కాని ఆయా బ్యాంకులు కాని స్పందించడానికి నిరాకరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం వెనుక వేరే కుట్ర దాగి ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకుల్లోని వాటాలను సులభంగా ప్రయివేటు శక్తులకు విక్రయించడానికి ఇదొక మార్గమని, అందుకోసమే ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తుందని బ్యాంకింగ్ సంఘాలు, నిపుణులు పేర్కొంటున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నెముఖగా ఉన్న పీఎస్బీలను విలీనం చేయడం, వాటిలో వాటాలో విక్రయించడం ఆర్ధిక వ్యవస్థకు మంచిది కాదని, దీని వల్ల ఉద్యోగాల కల్పన కూడా పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.