Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐదేండ్లలో ఘనంగా పెరిగిన ఎం-క్యాప్లు
- 4.48లక్షల కోట్లకు పడగలెత్తిన రిలయన్స్
- లక్ష కోట్లు పెరిగిన అదానీ సంస్థల విలువ
- అదే బాటలో మరిన్ని కార్పొరేట్ సంస్థలూ..
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో సంపన్నులకు అనుకూలమైన సర్కారుగా పేరు తెచ్చుకున్న నరేంద్ర మోడీ పాలనలో ఆయనకు అనుయాయులుగా ఉన్న పారిశ్రామికవేత్తలు వేల కోట్ల మేర లాభాలను వెనుకేసుకున్నట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. కేంద్రంలో అంతకు ముందు అధికారంలో ఉన్న యూపీఏ-2 హయాంతో పోలిస్తే.. మోడీ సర్కారు హయాంలో కార్పొరేట్ దిగ్గజాలైన ముఖేశ్ అంబానీ, అదానీలతో పాటు పలువురు సంపన్నుల కంపెనీల మార్కెట్ విలువ ఎన్నడూ లేని విధంగా గణనీయంగా పెరిగింది. ఫలితంగా ఆయా సంస్థల యజమానుల సంపద కూడా ఘనంగా ఎగిసింది. మార్కెట్లో ఈ బడాబాబులకు చెందిన సంస్థల షేర్ల కదలికలను చూస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. మార్కెట్లో అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ముఖేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూపు మార్కెట్ విలువ గడిచిన ఐదేండ్ల కాలంలో దాదాపు రూ.4.48 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు యూపీఏ-2 హయాంలో ముఖేశ్ అంబానీ సంస్థ మార్కెట్ విలువ కేవలం రూ.11,684 కోట్ల మేర మాత్రమే పెరిగింది. అయితే ఈ సంస్థ మార్కెట్ విలువ రికార్డు స్థాయిలో పెరగడానికి పలు కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని యూపీఏల సర్కారు పాలనా కాలం నుంచి పెట్టిన భారీ పెట్టుబడులు, చేపట్టిన విస్తరణ పనులు మోడీ సర్కారు హయాంలో ఒక కొలిక్కి రావడంతో ఆదాయం పెరిగినట్టుగా ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ టెలికాం, రిటైల్, సామర్థ్యం పెంపు తదితర అంశాల వైపు కూడా దృష్టి సారించడం కూడా మార్కెట్లో ఆ సంస్థ విలువ పెరగడానికి కారణమని పలు విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే పెట్టుబడులు ఎన్ని పెట్టినా.. వాటి నుంచి లాభాలను పొందే వాతావరణం కేంద్రం నుంచి నిరంతరాయంగా లభించడం వల్లే రిలయన్స్ సంస్థ మార్కెట్లో లాభపడిందని విమర్శకులు చెబుతున్నారు. రిలయన్స్ సంస్థ భారీస్థాయిలో రూ.4.48 లక్షల కోట్ల మేర లాభాలను ఆర్జించడం వెనుక ఖచ్చితంగా మోడీ సర్కారు సపోర్టు ఉందని వారు విశ్లేషిస్తున్నారు. జియో విషయంలో మోడీ సర్కారు రిలయన్స్కు ఇచ్చిన సహకారాన్ని వారు దీనికి ఉదాహరణగా చూపుతున్నారు.
మరోవైపు మోడీకి అత్యంత ప్రియమైన పారిశ్రామికవేత్తగా పేరున్న అదానీ గ్రూపు సంస్థలు కూడా ఎన్డీఏ పాలనలో విశేషంగా లాభపడాయి. ఆ గ్రూపునుకు చెందిన ఆరు కంపెనీల మార్కెట్ విలువ గడిచిన ఐదేండ్లలో రూ.1.53 లక్షల కోట్లకు చేరింది. అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ గ్యాస్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ సంస్థల మార్కెట్ విలువ గణనీయంగా పెరిగింది. అంతకు ముందు యూపీఏ-2 పాలన ముగిసే నాటికి ఈ గ్రూపు సంస్థల మార్కెట్ విలువ కేవలం రూ.43,651 కోట్లుగా నిలిచింది. అంటే మోడీ పాలన కాలంలో అదానీ కంపెనీల మార్కెట్ విలువ దాదాపు రూ. 99,898 కోట్ల మేర పెరిగిందన్నట్టు. ఇదే సమయంలో బజాజ్ గ్రూపునకు చెందిన 10 గ్రూపు సంస్థల మార్కెట్ విలువ రూ.3.62 కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు ఐదేండ్ల కాలంలో ఈ గ్రూపు సంస్థల మార్కెట్ విలువ ఎదుగుదల రూ.76,322 కోట్లుగా ఉంది. మరోవైపు బిర్లా గ్రూపు సంస్థల మార్కెట్ విలువ రూ.1.05 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు యూపీఏ-2 హయాంలో బిర్లాల సంస్థల మార్కెట్ విలువ రూ.1.02 కోట్లుగా నిలిచింది. మరోవైపు టాటా గ్రూపు స్టాక్స్ మార్కెట్ విలువ రూ.4.22 కోట్ల మేర పెరిగాయి.
అనుకూలత ఉన్నా అంతంతే పెరుగుదల..
మోడీ సర్కారు గద్దెనెక్కక ముందు యూపీఏ-1, యూపీఏ-2 ప్రభుత్వాల కాలంలో అంతర్జాతీయంగా వ్యాపార, వాణిజ్యాలకు పూర్తి అనుకూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దీనికి తోడు గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పట్లో ప్రపంచ మార్కెట్లు పరుగుల పెట్టాయి. ఈ పరిస్థితితో అంతర్జాతీయంగా పెరిగిన మార్కెట్ అవ కాశాలను చాలా భారత కంపెనీలు పూర్తిస్థాయిలో అంది పుచ్చుకొని అభివృద్ధి చెందాయి. అయితే ఈ సమయంలో మోడీ అనుకూల పారిశ్రామికవేత్తల వర్గం వారి సంస్థలు సాధించిన లాభాలు,పెంచుకున్న మార్కెట్ విలువ అంతంతగానే ఉంది. అయితే మోడీ సర్కారు అధికారం లోకి వచ్చాక అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొని అంతర్జాతీయ మార్కెట్ విస్తృతి కుదించుకుపో యింది. దేశీయంగా కూడా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల కారణంగా వ్యాపార అనుకూల వాతావర ణం పూర్తిగా దెబ్బతింది. అయినా మోడీ అనుయాయుల సంస్థలు లక్షల కోట్లలో తమ మార్కెట్ విలువను పెంచు కోవడం విశేషం. అంతర్జాతీయంగా అనుకూలత లేకపో యినా.. సర్కారు అండ కారణంగానే మోడీ అనుకూల వర్గం వారి కంపెనీలు గడిచిన ఐదేండ్ల లో రికార్డు స్థాయి లో మార్కెట్ విలువను పెంచుకోగలిగాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు.
మోడీ ప్రభుత్వ హయాంలో ఆయా సంస్థలు తమకు అనుకూలమైన నిర్ణయాలను సర్కారు ద్వారా ఇప్పించుకొని.. వ్యాపార విస్తరణలకు పాల్పడుతూ మార్కెట్ విలువను లక్షల కోట్ల మేర పెంచుకున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సర్కారును అడ్డుపెట్టుకొని ఆయా సంస్థలు జరిపిన లాబీయింగ్ కారణంగానే సంపన్నుల కంపెనీలు లక్షల కోట్ల మేర మార్కెట్ విలువను పెంచుకొని దూసుకుపోతున్నాయన్నది వారి మాట. అధికార పార్టీకి వందలు, వేల కోట్లలో చందాలిచ్చి లాబీయింగ్ చేసుకొన్న ఆయా సంస్థలు ఇప్పుడు లక్షల కోట్లలో సంపదను వెనుకేసుకున్నట్టుగా వారు ఆరోపిస్తున్నారు.