Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రికార్డు స్థాయిల్ని తాకి.. కుంగిన సూచీలు
- 40 వేల రికార్డు స్థాయికి సెన్సెక్స్ చేరిక
- 1300 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్..
- మదుపరుల్లో మొదలైన సరికొత్త భయాలు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: లోక్సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ ప్రభంజనం వీచినప్పటికీ.. దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం గురువారం నష్టాల్లో ముగిశాయి. గురువారం ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏకు మెజార్టీ పెరుగుతున్న కొద్ది దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. మార్కెట్లు ప్రారంభం నుంచి కూడా లాభాల మోడ్లోనే పరుగులు పెట్టాయి. ఎన్డీఏ తిరిగి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమంటున్న ఫలితాల సరళితో ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ కొనుగోళ్లకు ఎగబడ్డారు. దీంతో తొలి గంటన్నరలో బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయిలో రాణిస్తూ.. ఇంట్రాడేలో 40,124.96 పాయింట్ల జీవిత కాల గరిష్టాన్ని తాకింది. ఆ తరువాత నుంచి మదుపరులు లాభాల స్వీకరణకు దిగడం కనిపించింది. మోడీ సర్కారు మళ్లీ పూర్తిస్థాయిలో అధికారంలోకి రానుందని.. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితి రానున్న రోజుల్లోనూ కొనసాగే అవకాశం ఉందంటూ వెలువడిన విశ్లేషణలు మార్కెట్లను కలవరపెట్టాయి. దేశంలో మందగమన పరిస్థితులు, నిరుద్యోగం వంటి సమస్యలు రానున్న రోజుల్లో మరింతగా పెరిగపోయి ఆర్థిక వ్యవస్థకు తీవ్ర ప్రతిబంధకంగా మారనున్నాయన్న వార్తలు మదుపరుల్లో కొత్త ఆందోళనలకు తెరతీశాయి. దీంతో మార్కెట్లు జోరు తగ్గి ఆఖరున నష్టాల్లోే ముగిశాయి. భారీ అమ్మకాల నేపథ్యంలో ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 299 పాయింట్ల నష్టంతో 38,811 పాయింట్ల వద్ద ముగిసింది. దీంతో ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే ఈ ఇండెక్స్ 1,300 పాయింట్లకు పైగా పతనమైనట్టయింది. ఇక నిఫ్టీ ఇండెక్స్ కూడా 12,041 పాయింట్ల ఆల్టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఈ సూచీ కూడా చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి 81 పాయింట్ల నష్టంతో 11,657 పాయింట్లకు పడిపోయింది. సెన్సెక్స్ 40,000 మార్క్ను, నిఫ్టీ 12,000 మార్క్ను అందుకోవడం ఇదే తొలిసారి. సెన్సెక్స్లో 15 స్క్రిప్లు లాభాల్లో నిలువగా.. 16 స్టాక్స్ నష్టాల్లో నడిచాయి. ఇన్ఫ్రా మినహా మిగతా రంగాలైన ఎఫ్ఎమ్సీజీ, ఇంధన, లోహ, ఐటీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లన్నీ నష్టాల్లో ముగిశాయి. కాగా.. ఇండస్ఇండ్ బ్యాంక్, జీ ఎంటర్టైన్మెంట్, అదానీ పోర్ట్స్, గ్రాసిమ్ ఇండిస్టీస్, సిప్లా షేర్లు లాభపడగా.. వేదాంత, ఐటీసీ, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు నష్టపోయాయి. నిఫ్టీ 50లో అదానీ పోర్ట్స్, జీ ఎంటర్టైన్మెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా, యస్ బ్యాంక్, హీరో మోటొకార్ప్, కోల్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 6 శాతం ర్యాలీ చేసింది. అదేసమయంలో వేదాంత, ఐషర్ మోటార్స్, ఐటీసీ, హిందాల్కో, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు పడిపోయాయి. సెక్టోరల్ ఇండెక్స్లన్నీ మిశ్రమంగా ముగిశాయి.
నిఫ్టీ మీడియా, నిఫ్టీ రియల్టీ ఇండెక్స్లు మినహా మిగతావన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ మెటల్, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు ఎక్కువగా నష్టపోయాయి.
మోడీ.. ఇకనైనా 'మేలు'కోండి!
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి.. త్వరలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మోడీ సర్కారు సిద్ధమవుతున్న తరుణంలో.. దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై కొత్త అనుమానాలు తెర పైకి వస్తున్నాయి. గడిచిన ఐదేండ్ల కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ఆర్థిక రంగం విషయంలోనే ప్రధానంగా విఫలమవుతూ వచ్చారు. అనాలోచితంగా చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు భారతీయ రిజర్వు బ్యాంక్ స్వతంత్రతను కాపాడే విషయంతో సహా పెరుగుతున్న నిరుద్యోగితకు తగ్గట్టుగా కొత్త కొలువులను అందుబాటులోకి తేకపోవడం వంటి అంశాల్లో సర్కారు వైఫల్యం ఇప్పటికి ప్రతిబింబిస్తోంది. ఈ వైఫల్యాలకు ప్రధాన కారణంగా ఆయనకు సరైన ఆర్థిక సలహా మండలి లేకపోవడమేనని విశ్లేషకులు చెబుతున్నారు. స్వతహాగా ఆర్థిక వ్యవస్థపై పెద్దగా పట్టులేని మోడీ.. సర్కారులోని కొందరు సన్నిహితుల సూచనలను నమ్మి ముందుకుపోతుండడం వల్ల దేశానికి, సర్కారుకు చెడ్డపేరు వస్తోందని వారు చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా మోడీ తన ఆర్థిక సలహా మండలిని మార్చుకొంటే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు. దీనికి తోడు దేశ ఆర్థిక వ్యవస్థలో వాస్తవ పరిస్థితి బయటకు వెల్లడి కాకుండా సర్కారు వర్గాలు బయట ప్రపంచానికి తప్పుడు గణాంకాలను వెల్లడిస్తున్నట్టు కూడా ఇటీవల విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో అంతర్జాతీయంగా భారత ఆర్థిక వ్యవస్థకు ఉన్న విశ్వసనీయత గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ పాలనలో సన్నగిల్లింది. ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి. మోడీ సర్కారుకే తిరిగి పగ్గాలు అందాయి. దీంతో ఇకనైనా మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఆర్థిక వ్యవస్థ వాస్తవ రూపాన్ని ప్రజలకు వెల్లడిస్తే దేశానికి మంచిదని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. ప్రగతిని తిరిగి పట్టాలెక్కించేందుకు గాను అవసరమైన నిర్మాణాత్మక చర్యలు చేపడితే మేలని వారు సూచిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ఖర్చు తగ్గించుకొని ద్రవ్యలోటును పెరుగకుండా చర్యలు చేపట్టాల్సి అవసరమూ ఉందని వారు సూచిస్తున్నారు. దేశంలో పెరుగుతున్న ధరల కారణంగా గ్రామాల్లో వినిమయ శక్తి తగ్గిపోతోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి ప్రధాన హేతువుగా నిలుస్తోంది. కేవలం నిర్మాణ రంగంలో తప్ప విద్యుత్తు, టెలికాం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాలలో సర్కారు పెట్టుబడులు అంతంతగానే ఉంటున్నాయి. వీటిని అభివృద్ధి పరచకపోతే అసలైన మౌలిక వృద్ధి సిద్ధించదు. మోడీ సర్కారు ఈ విషయాలను గమనించి నిజమైన దేశాభివృద్ధికి అడుగులు వేస్తే మేలు అని విశ్లేషకులు చెబుతున్నారు. గురువారం మోడీ గెలిచినప్పటికీ మార్కెట్లు భారీగా పడిపోవడానికి ఈ అంశాలే ప్రధాన కారణమని వారు విశ్లేషిస్తున్నారు.