Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ 'కొత్త' చొరవకు ఆహ్వానం
- ఔత్సాహికులు ఎదిగేందుకు అవకాశం
- పేదల జీవన ప్రమాణాలూ పెరుగుతాయి
- ఆర్థిక వ్యవస్థలోకి 700 బి.డా. సంపద
- ప్రపంచ జీడీపీకి భారత్ చోదక శక్తి కాగలదు
- దేశ పారిశ్రామిక వర్గాలు
'దేశంలో మూలమూలన కొత్త సంస్థల (స్టార్టప్ల) ఏర్పాటును ప్రోత్సహిస్తాం. స్టార్టప్లతో భారత్ ప్రపంచ మేటిగా నిలిపేందుకు దృఢంగా నిర్ణయించాం. దేశంలో బ్యాంకులు స్టార్టప్ ఉద్యమానికి తమ వంతుగా సాయం అందజేయాలి. దేశంలో ఉన్న లక్షా పాతిక వేల బ్యాంకు శాఖలు ఒక దళిత లేదా గిరిజన ఔత్సాహిక వ్యవస్థాపకునికి, మహిళా ఔత్సాహిక వ్యవస్థాపకురాలికి చేయూతను అందించి భవిష్యత్తులో వారు పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగేందుకు సాయం చేయాలి. స్టార్టప్ విధానం క్రమంగా విస్తరిస్తే దేశంలో కొత్తకొత్త పారిశ్రమలు వస్తాయి, ఔత్సాహికవేత్తలు పారిశ్రామికవేత్తలుగా మారుతారు. వీరు ఇద్దరు, ముగ్గురికి ఉద్యోగాలను కల్పించడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో గణనీయమైన మార్పును గుర్తించవచ్చు.''
న్యూఢిల్లీ: ఎర్రకోట వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేస్తూ దేశంలో కొత్త సంస్థల (స్టార్టప్ల) ఏర్పాటు, వ్యవస్థాపక విధానాన్ని ప్రోత్సహించేందుకు గాను తాము దృఢ సంకల్పంతో ఉన్నామని ప్రకటించడం పట్ల పారిశ్రామిక రంగం హర్షం వ్యక్తం చేసింది. స్టార్టప్ కంపెనీల వల్ల దేశంలో కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రావడంతో పాటు ఆర్థిక వ్యవస్థలోకి కొత్తగా వందల కోట్ల రూపాయలన సంపద వచ్చి చేరుతుందని అంటున్నారు. స్టార్టప్ల ద్వారా సంపద సృష్టి అనే ప్రధాని ఆలోచన సరైందని ఫిక్కీ, సీఐఐ అభిప్రాయపడ్డాయి. దేశ వ్యాప్తంగా కొత్తగా కంపెనీలు, సంస్థల ఏర్పాటు వల్ల కేవలం లక్షల కొద్ది కొత్తకొత్త పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలుగా ఎదగే అవకాశం లభిస్తుందని, వారు నూతనం ఉద్యోగాలను సృష్టించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఫిక్కీ అధ్యక్షుడు జ్యోత్సా సూరీ అన్నారు. ప్రధాని ఆలోచన వల్ల దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేదలకు కూడా జీవనోపాధి అవకాశాలను అందిస్తుందని అన్నారు.
స్టార్టప్లను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ ఆలోచన భవితకు ఒక మూలస్తంభం కానుందని సీఐఐ అగ్రశ్రేణి కార్యవర్గం అభిప్రాయపడింది. కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టి, ఆర్థిక ప్రోత్సాహకాలను గురించి మోడీ ప్రస్థావించడం రానున్న రోజుల్లో అభివృద్ధికి తప్పక దోహదం చేయగలదని సీఐఐ అధ్యక్షుడు సుమిత్ మజుందార్ అన్నారు. వస్త్ర, తోళ్ల, ఫడ్ ప్రాసెసింగ్ వంటి కార్మికశక్తితో కూడిన రంగాలకు రానున్న రోజోల్లో కొత్త శకం ఆరంభానికి ఈ చర్య దోహదం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సిలికాన్ వ్యాలీకి చెందిన 'డ్రూమ్' స్టార్టప్ సీఈఓ సందీప్ అగర్వాల్ మాట్లాడుతూ మోడీ కొత్త చోరవ వల్ల తొలి దశలోనే దాదాపు 200 బిలియన్ డాలర్ల సంపదను డిజిటల్ ఆర్థిక వ్యవస్థలోనూ, 200-500 బిలియన్ డాలర్ల సంపదను ఇతర పరిశ్రమల ద్వారాను సృష్టించబడే అవకాశం ఉందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు స్టార్టప్ కంపెనీలకు, ఔత్సాహికులైన వ్యవస్థాపకులు విస్తరించేందుకు దోహదం చేస్తుందని ఆయన అన్నారు. ప్రపంచ జీడీపీ పెరుగుదలకు భారత్ చోదక శక్తి కాగలదని ఆయన అన్నారు. ప్రపంచ జీడీపీలో 5 శాతంగా ఉన్న భారత వాటా రానున్న 15 ఏళ్లలో 20 శాతానికి చేరగలదని ఆయన విశ్లేషించారు.