Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశంలోని బంగారం తనఖా మార్కెట్లోకి మొట్టమొదటి సారిగా ప్రపంచ బ్యాంక్ గ్రూపు సంస్థ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఎఫ్ఎస్) అడుగుపెట్టింది. ఇందులో భాగంగా సంస్థ గోల్డ్లోన్ మార్కెట్లో దిగ్గజంగా వెలుగొందుతున్న మణప్పురం ఫైనాన్స్లో 35 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. భారత్లో ప్రజలు ఎక్కువగా తమ రుణ అవసరాల కోసం పసిడిని తనఖా పెట్టేందుకు ఆసక్తి చూపుతారని ఈ నేపథ్యంలో గ్రామీణ భారతంతో పాటు పేద ప్రజలకు విలువైన రుణదాతగా అన్నివేళల అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తాము మణప్పురం సంస్థతో జట్టుకట్టాలని నిర్ణయించినట్టుగా ఐఎఫ్సీ సంస్థ భారత విభాగం అధికారి జున్ ఝాంగ్ తెలిపారు. దీంతో భారత్లో అనధికారికంగా బంగారం రూపంలో ప్రజలు భారీగా దాచుకుంటున్న పసిడిని సాధారణ ఆర్థిక వ్యవస్థలోకి తీసుకువచ్చే ఉద్దేశంతోనే తాము ఈ అడుగు వేస్తున్నట్టుగా జున్ వివరించారు. మణప్పురంలో పెట్టుబడులు పెట్టడంతో సంస్థకు అంతర్జాతీయంగా ఒక గుర్తింపు వచ్చిందని దీంతో రానన్నరోజుల్లో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు వీలుపడుతుందని మణప్పురం వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచ గోల్డ్ కౌన్సిల్ అంచనాల ప్రకారం భారతీయుల దాదాపు 23,000 టన్నుల బంగారం ఉంది. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.70 లక్షల కోట్లు. ఇంత భారీ నిల్వలు ఉన్నప్పటికీ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ సంస్థల బంగారం లోన్ మార్కెట్ విస్తృతి కేవలం 19.6 బిలియన్ డాలర్లుగా ఉంది. రానున్న రోజుల్లో ఈ విభాగంలో వేగంగా వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని.. అందుకే ఐఎఫ్ఎస్ సంస్థ భారత్లో మణప్పురంతో కలిసి మార్కెట్లో దిగ్గజం పాత్ర పోషించాలని భావిస్తోందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే భారత గోల్డ్లోన్మార్కెట్ను టార్గెట్గా ప్రపంచ బ్యాంక్ సంస్థ రంగంలోకి దిగడం పలు అనుమానాలకు తావిస్తోంది.