Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీఎస్టీఎన్ నుంచి అందుబాటులోకి కొత్త సాఫ్ట్వేర్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు మేలు జరిగేలా వస్తుసేవల పన్ను (జీఎస్టీ) నియంత్రణ సంస్థ జీఎస్టీ నెట్వర్క్ (జీఎస్టీఎన్) సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. సంవత్సరానికి రూ.1.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన సంస్థలకు వెసులుబాటుగా ఉండేందుకు గాను జీఎస్టీ నెట్వర్క్ ఉచిత అకౌంటింగ్, బిల్లింగ్ సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త సాఫ్ట్వేర్తో చిన్న వ్యాపార సంస్థలు బిల్లును జారీ చేయడానికి, ఖాతాల నిల్వలు తేల్చడానికి, ఇన్వెంటరీని నిర్వహించడానికి, జీఎస్టీ రిటర్నులను సులభంగా తయారు చేయడానికి తొడ్పడనుంది. షషష.స్త్రర్.స్త్రశీఙ.ఱఅ పోర్టల్లోని డౌన్లోడ్ ట్యాబ్ మీటుపై నొక్కడం ద్వారా సాఫ్ట్వేర్ను పొందవచ్చని జీఎస్టీ నెట్వర్క్ సంస్థ తెలిపింది. ఈ సౌలభ్యంతో దాదాపు 80 లక్షల వరకు చిన్న వ్యాపార సంస్థలకు మేలు జరుగనుందని ప్రభుత్వం చెబుతోంది. పూర్తి ఉచితంగా ఈ సాఫ్ట్వేర్ను అందించేందుకు గాను జీఎస్టీఎన్ సంస్థ ఎనిమిది బిల్లింగ్, అకౌంటింగ్ సాఫ్ట్వేర్ వెండార్లతో జట్టుకట్టింది. అమ్మకాలు, కొనుగోళ్లు, నగదు పుస్తకం నిర్వహణ, ఇన్వెంటరీ నిర్వహణ, సప్లయర్లు, వినియోగదారుల మస్టర్లు, ఇన్వాయిస్ల తయారీ సేవలు జీఎస్టీ రిటర్ను సేవలు ఉచితం కాగా, బ్యాంకు ఖాతాల రీకన్సిలేషన్, రావాల్సిన బకాయీల ఖాతాల నిర్వహణ తదితర సేవలకు కొంత వినియోగ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. చిన్న సంస్థలు డిజిటల్ వేదికపైకి వచ్చి తమ వ్యాపార సామర్థ్యాన్ని మరింతగా పెంచుకొనేందుకు, పన్ను చెల్లింపు విధానాన్ని సులభతరం చేసుకొనేందుకు గాను తాము చేసిన ఈ ప్రయత్నం ఎంతగానో మేలు చేయగలదని జీఎస్టీఎన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రకాశ్ కుమార్ తెలిపారు. జీఎస్టీ మండలి సమావేశం సూచనల మేరకు తాము దీనిని తయారు చేసి వ్యాపార సంస్థలక అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన వివరించారు.