Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 44.37 బిలియన్ డాలర్లకే పరిమితం..
- దాదాపు ఆరేండ్ల తరువాత 'డౌన్'ట్రెండ్
- టెలికాం, ఫార్మా రంగాలలో కుంగుబాటు
- సింగపూర్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు
న్యూఢిల్లీ: వ్యాపారానుకూల వాతావరణం అంత ఆశాజనకంగా కనిపించకపోవడంతో భారత్కు వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో (ఎఫ్డీఐ) క్షీణత నమోదయింది. మార్చితో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 1 శాతం మేర తగ్గి 44.37 బిలియన్ డాలర్లకు చేరిందని మంగళవారం సర్కారు వెల్లడించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో (2017-18లో) 44.85 బిలియన్ డాలర్లుగా నమోదు అయినట్టుగా డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండిస్టీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) మంగళవారం తెలిపింది. గడిచిన ఆరేండ్ల కాలంలో దేశంలోకి వచ్చే ఎఫ్డీఐలు పడిపోవడం ఇదే తొలిసారి. ముఖ్యంగా టెలికాం, ఫార్మాతో పాటు ఇతర కీలక రంగాలకు విదేశాల నుంచి పెట్టుబడులు తగ్గడంతో ఎఫ్డీఐల వృద్ధితో క్షీణత నమోదైనట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంతకు ముందు 2012-13 ఆర్థిక సంవత్సరంలో తొలిసారిగా భారత్కు వచ్చే ఎఫ్డీఐల రాక దాదాపు 36 శాతం మేర తగ్గి 22.42 బిలియన్ డాలర్లుగా నమోదు అయింది. 2011-12లో ఎఫ్డీఐ పెట్టుబడులు 35.12 బిలియన్ డాలర్లుగా ఉంది. సర్కారు గణాంకాల ప్రకారం 2012-13 నుంచి భారత్కు వస్తున్న ఎఫ్డీఐ రాక నిరంతరాయంగా పెరగుతూనే వస్తోంది. ఇప్పుడు తాజాగా 2017-18 ఆర్థిక సంవత్సరానికి ఎఫ్డీఐల రాక తగ్గడం శోచనీయం. 2018-19 ఆర్థిక సంవత్సరంలో టెలికమ్యూనికేషన్స్, నిర్మాణాభివృద్ధి, ఫార్మా రంగంతో పాటు విద్యుత్తు రంగాలకు ఎఫ్డీఐల రాక గణనీయంగా తగ్గింది. టెలికాం విభాగంలో ఎప్డీఐలు 6.21 బిలియన్ డాలర్ల నుంచి 2.67 బిలియన్ డాలర్లకు, నిర్మాణాభివృద్ధి రంగాల్లో 540 మిలియన్ డాలర్ల నుంచి 213 మిలియన్ డాలర్లకు, ఫార్మా రంగంలో ఎఫ్డీఐలు బిలియన్ డాలర్ల నుంచి 266 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో సేవల రంగం, కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్, ట్రేడింగ్, ఆటోమొబైల్ రంగాలకు అత్యధికంగా ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ సారి భారత్లో అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాలలో సింగపూర్ అగ్ర స్థానంలో నిలిచింది. అంతకు ముందు ఈ స్థానంలో మారిషస్ నిలిచింది. అత్యధికంగా పెట్టుబడులు పెట్టిన దేశాల జాబితాలో సింగపూర్, మారిషస్ తరువాత నెదర్లాండ్స్, బ్రిటన్, అమెరికా, జర్మనీ, సైప్రస్, యూఏఈ, ఫ్రాన్స్ దేశాలు అగ్రభాగాన నిలిచాయి.