Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీలకం కానున్న వృద్ధి, ఎన్పీఏలు
- ద్రవ్యలోటు తగ్గింపు పెద్ద సవాలే..
- ఆర్బీఐతో వ్యవహర శైలి కీలకం
న్యూఢిల్లీ: స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, బలహీన పెట్టుబడులు, పేలవమైన వినియోగం, డిమాండ్లతో దేశ ఆర్థిక వ్యవస్థ సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో దేశ ప్రధానిగా మళ్లీ నరేంద్ర మోడీ పగ్గాలు చేపట్టారు. ఈ తరుణంలో మోదీ సర్కారుకు అనేక ఆర్థిక సవాళ్లు స్వాగతం పలకనున్నాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నాలుగో త్రైమాసికం (క్యూ4) వృద్ధి గణాంకాలతో పాటు పూర్తి ఆర్థిక సంవత్సరం జీడీపీ గణాంకాలు, ద్రవ్యలోటు లెక్కలు కొత్త సర్కారు భవిష్యత్తు అంచనాలపై ఒక స్పష్టమైన చిత్రాన్ని అందించే అవకాశం ఉంది. ఆర్బీఐ మిగులు నిధుల వినియోగంపై బిమల్ జలాన్ కమిటీ నివేదిక, మొండిబకాయిల పరిష్కారంపై ఆర్బీఐ జారీ చేయనున్న తాజా ఆదేశాలు, ద్రవ్యలోటు గణాంకాలు, జీడీజీ.. ఈ నాలుగు అంశాలు 'మోదీ 2.0' ప్రభుత్వానికి చాలా కీలకమని పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఎన్పీఏలు అసలు సమస్య...
మోదీ నేతృత్వంలోని రెండో విడత ఎన్డీఏ సర్కారు కొలువుదీరిన తర్వాత మొండిబకాయిల (ఎన్ పీఏ) పరిష్కారానికి సంబంధించి ఆర్బీఐ సవరించిన ఆదేశాలను జారీచేయనుంది. అయితే, గతానికి భిన్నంగా ఎన్పీఏల విషయంలో ఆర్బీఐ తన కఠిన విధానాన్ని కొంత సడలించే అవకాశం ఉండొచ్చని బ్యాంకర్లు అభిప్రాయపడుతున్నారు. ఎన్పీఏలపై 2018, ఫిబ్రవరి 12న జారీ చేసిన ఆర్బీఐ సర్క్యులర్ను సుప్రీం కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎన్నికల కోడ్ తొలగనున్న నేపథ్యంలో కొత్త సర్క్యులర్ను ఆర్బీఐ మరికొన్ని రోజుల్లో విడుదల చేసేందుకు మార్గం సుగమం అవుతోంది. దీని ప్రకారం ఎన్ పీఏల గుర్తింపు, ఖాతాలను ఎన్పీఏలుగా వర్గీకరించేందుకు, అదేవిధంగా దీనికి సంబంధించి పరిష్కారం విషయంలో (ఎన్సీఎల్టీని ఆశ్రయించడం) మరింత గడువు ఇచ్చేవిధంగా కొత్త సర్క్యులర్ ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంలో భారతీయ బ్యాంకుల సంఘం(ఐబీఏ) సూచనలను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంది. కాగా, ఆర్బీఐ వద్ద ఎంతమేరకు మిగులు నిధులు ఉంచుకోవాలి అనేదానిపై మాజీ ఆర్బీఐ గవర్నర్ బిమల్ జలాన్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ తన నివేదికను జూన్ లో సమర్పించనుంది. ఆర్బీఐ మిగులు నిధులను ప్రభుత్వానికి బదలాయించే విషయంలో మోదీ సర్కారు ఆర్బీఐ స్వేచ్ఛకు తూట్లు పొడుస్తోందంటూ విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జలాన్ కమిటీ నివేదిక మోడీ సర్కారుకు కీలకం కానుంది.
వృద్ధి మందగించే అవకాశం..
మార్చితో ముగిసిన 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతానికి మందగించొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఆరు త్రైమాసికాల్లో ఇదే అత్యల్ప వృద్ధి రేటుగా మారనుంది. అంతేకాదు ఈ ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సర పనితీరుపైనా ప్రతిబింబించే అవకాశం కనిపిస్తోంది. ఫలిలతంగా ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ మందగ మనం కొనసాగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది (2018-19లో) తొలి త్రైమాసికంలో 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో 7 శాతానికి.. మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి దిగజారిన సంగతి తెలిసిందే. మరోపక్క, ప్రభుత్వం 2018-19లో లక్ష్యంగా పెట్టుకున్న ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయ, వ్యయాల మధ్య వ్యత్యాసం) గణాంకాలు కూడా జీడీపీ డేటాతో పాటు ఈ నెలాఖరు (మే 31)లో వెలువడనున్నాయి. తొలుత ద్రవ్యలోటును 3.3 శాతానికి కట్టడి చేస్తామని పేర్కొన్న మోదీ సర్కారు... ఆ తర్వాత 3.4 శాతానికి దానిని సవరించిన సంగతి తెలిసిందే. కాగా, ఫిబ్రవరి చివరినాటికే ద్రవ్యలోటు రూ.8,51,499 కోట్లకు చేరింది. ఇది బడ్జెట్ అంచనాలతో పోలిస్తే 134 శాతం అధికం. అంటే జీడీపీలో 4.52 శాతానికి సమానం.