Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టాల్లోకి జారుకున్న స్టాక్ సూచీలు
- ప్రభావం చూపిన సూక్ష్మ గణాంకాలు
న్యూఢిల్లీ: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతాన్ని నష్టాల్లో ముగించాయి. నరేంద్ర మోడీ నేతృత్వంలో గురువారం కొలువుదీరిన కొత్త సర్కారులో మంత్రులకు శాఖల కేటాయింపులు మార్కెట్ను నిరుత్సాహ పరిచింది. దేశ ఆర్థిక అంశాలపై అంతగా అనుభవం లేని నిర్మలా సీతారామన్కు మోడీ కీలకమైన ఆర్థిక శాఖను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం మార్కెట్ వార్గలకు రుచించలేదు. మందగమనం కారణంగా కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించేందుకు అనుభవజ్ఞులైన పీయూష్ గోయల్, రవిశంకర్, అమిత్షా లేదా రాజ్నాథ్లకు ఆర్థిక శాఖను అప్పగిస్తే వారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకొనే వారన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమైంది. ఇందుకు భిన్నంగా నిర్మాలా సీతారామన్కు ఆర్థికం అప్పగించడంతో రానున్న రోజుల్లో సంస్కరణలను మందగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు మార్కెట్ను నిరుత్సాహపరిచాయి. రూపాయి లాభపడటం, ముడి చమురు ధరలు పడిపోవడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో మార్కెట్ ఉదయం లాభాల్లోనే ప్రారంభమైంది. కానీ తర్వాత బ్యాంకింగ్ సహా పలు ఇతర షేర్లలో అమ్మకాలు పెరిగిపోవడంతో మార్కెట్ నష్టాల్లోకి వెళ్లింది. ఆరంభంలోనే కీలక మార్కెట్ ఆల్టైమ్ గరిష్ట స్థాయిలకు దగ్గరకు వెళ్లాయి. కానీ బెంచ్మార్క్ సూచీలు అక్కడే నిలదొక్కుకోలేకపోయాయి. చివరకు సెన్సెక్స్ 118 పాయింట్ల నష్టంతో 39,714 పాయింట్లకు క్షీణించింది. ఇక నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 11,923 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. దీంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర ఉగిసలాటల నడుమ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ ఇంట్రాడేలో 12,039 పాయింట్లకు ఎగసింది. సెన్సెక్స్ 40,122 పాయిం ట్లకు చేరింది. ప్రభుత్వం శుక్రవారం వెల్లడించిన పలు సూక్ష్మ గణాంకాలు ప్రతికూలంగా ఉండడం కూడా మార్కెట్లో మదుపరుల సెంటిమెంట్ను దెబ్బతీసింది. నిఫ్టీ 50లో టెక్ మహీంద్రా, టీసీఎస్, ఏసియన్ పెయింట్స్, ఐఓసీ, బ్రిటానియా షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి. టీసీఎస్ 2.5 శాతం పెరిగింది. అలాగే యస్ బ్యాంక్, ఐటీసీ, గ్రాసిమ్, జీ ఎంటర్టైన్మెంట్, వేదాంత షేర్లు టాప్ లూజర్లుగా ఉన్నాయి. యస్ బ్యాంక్ దాదాపు 5 శాతం పడిపోయింది.