Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెల్స్గర్ల్ నుంచి కీలక మంత్రిగా..
- చాలా కఠిన సమయంలో పగ్గాలు
- ప్రతికూలంగా స్పందించిన మార్కెట్లు
న్యూఢిల్లీ: రెండోసారి కొలువుదీరిని మోడీ సర్కారు కీలకమైన ఆర్థిక శాఖను నిర్మలా సీతారామన్కు అప్పగిస్తూ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. అమిత్షాకు ఆర్థిక శాఖను అప్పగిస్తారంటూ వచ్చిన అంచనాలకు భిన్నంగా మోడీ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. శుక్రవారం నిర్మాలా సీతారామన్ ఆర్థిక శాఖ పగ్గాలను చేపట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మహిళగా నిర్మాలా సీతారామన్ రికార్డు సృష్టించారు. అంతకు ముందు 1970 నుంచి 1971 వరకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. తమిళనాట పుట్టిన నిర్మలా తెలుగింటి కోడలు. సేల్స్ గర్ల్ స్థాయి నుంచి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. ఎకనామిక్స్లో బీఏ పట్టా పోందిన నిర్మలా అనంతరం జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి 1984లో నిర్మలా మాస్టర్స్ డిగ్రీ పొందారు. అక్కడే ఆమె భర్త పరకాల ప్రభాకర్ను కలిశారు. 1986లో వీరి వివాహం జరిగింది. 2008లో భాజపాలో చేరారు. 2010 నుంచి 2014 వరకు పార్టీ జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. కార్యకర్తగా, ప్రతినిధిగా ఎన్నో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. ఈమె సేవలను గుర్తించి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తొలిసారి వాణిజ్య శాఖ సహాయ మంత్రి అవకాశం కల్పించారు. ప్రస్తుతం రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మోదీ తొలి ప్రభుత్వంలో రక్షణ శాఖ మంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గోవా సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో ఆ పదవి ఈమెను వరించింది. 2017లో ఈమె రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇందిరాగాంధీ తర్వాత ఈ శాఖ మంత్రిగా పనిచేసిన మహిళా మంత్రిగా ఘనత సాధించారు. జవహర్లాల్ యూనివర్సిటీ నుంచి పట్టా పుచ్చుకున్నా..సేల్స్ గర్ల్గా పనిచేశారు. లండన్లోని రెజెంట్ స్ట్రీట్లో గృహోపకరణాల స్టోర్లో పనిచేశారు. తర్వాత యూకేలో అగ్రికల్చరల్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆర్థిక సలహాదారుగా పనిచేశారు. వాజ్పేయీ ప్రభుత్వంలో 2003 నుంచి 2005 వరకు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగానూ ఉన్నారు. గత ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఈమె ఆర్థిక మంత్రిగా మరెన్ని సంస్కరణలను ముందుకు తీసుకెళ్తారో వేచి చూడాలి. ఆర్థిక వ్యవస్థలో మందగమనం నెలకొని వృద్ధి పడిపోయిన ప్రస్తుత కీలక సమయంలో నిర్మల పగ్గాలు చేపట్టడం విశేషం. అయితే సీతారామన్ నియమకానికి దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రతికూలంగా స్పందించి నష్టాల్లో ముగిశాయి.