Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, 'ఎవర్ గ్రీన్టీ మ్యాన్ ఆఫ్ ఇండియా' బి.ఎం. ఖైతాన్ (92) శనివారం కోల్కతాలో కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్యంలో వచ్చే సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ శనివారం కోల్కతాలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. భారత్లోని టీ పరిశ్రమకు ఆయన్ను పెద్దదిక్కుగా భావిస్తారు. తొలత మెక్లియోడ్ రస్సెల్ సంస్థకు ఎరువులు, టీ పంపిణీదారుగా తన వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన దశల వారీగా ఎదుగుతూ ఖైతాన్ ఆ తరువాత ఆ గ్రూపు కంపెనీలకు మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరారు. విలిమ్సన్ మేగర్ గ్రూప్ (డబ్ల్యుఎంజీ) వ్యవస్థాపకులైన ఖైతాన్ ఆ తరువాత తన తేయాకు వ్యాపారాన్ని విస్తరిస్తూ డబ్ల్యుఎంజీని ప్రపంచంలోనే అతిపెద్ద తేయాకు కంపెనీగా మార్చారు. అనంతరం కంపెనీ తన కార్యకలాపాలను ఆఫ్రికా వియత్నామ్లకు కూడా విస్తరించారు. తేయాకు కంపెనీతో పాటు ఆయన యూనియన్ కార్బైడ్ కంపెనీకి చెందిన ఎవరెడీ ఇండిస్టీస్ను కొనుగోలు చేశారు. అప్పట్లో ఇది అతిపెద్ద కార్పొరేట్ టేకోవర్గా రికార్డు సృష్టించింది. తన వ్యాపారాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తరించుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకతను తెచ్చుకున్న ఖైతాన్ గత ఏడాది వరకు కూడా గ్రూప్నకు చెందిన ఎవరెడీ ఇండిస్టీస్, మెక్లాయిడ్ రస్సెల్ సంస్థల చైర్మెన్గా సేవలందిచారు. గత ఏడాది తొలినాళ్లలో తన పదవికి రాజీనామా చేశారు. ఆయన మృతికి భారత టీ అసోసియేషన్ కూడా సంతాపం తెలిపింది. ఖైతాన్ 2013లో ఇండియాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) కోల్కతా జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఆయన 1973లో ఐసీసీ అధ్యక్షుడిగా పని చేశారు. ''ఆయన మృతి వ్యాపార వర్గాలకు తీరని లోటు'' అని ఐసీసీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ సింగ్ పేర్కొన్నారు.