Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 22శాతం పడిపోయిన మారుతీ సేల్స్
- చిన్నకార్ల అమ్మకాల్లోనూ అదే క్షీణత
- టాటా, హీరో సేల్స్ భారీగా డౌన్..
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న ప్రతికూలత కారణంగా దేశీయంగా కార్ల అమ్మకాలు ఆందోళనకర స్థాయిలో పడిపోతున్నాయి. ఏప్రిల్ మాసంలో కుంగిన అమ్మకాలతో పోలిస్తే మే మాసంలో విక్రయాలు మరింతగా క్షీణించినట్టుగా ఆటోమొబైల్ సంస్థలు ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు శనివారం వెల్లడించిన మే మాసపు అమ్మకాల వివరాల ప్రకారం చూస్తే మారుతీ సుజుకీ, మహీంద్రా, టాటా మోటార్స్, టయోటాకంపెనీల అమ్మకాలు వేగంగా పడిపోయాయి. దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ సంస్థ విక్రయాలు గత మే మాసంలో దాదాపు 22 శాతం మేర క్షీణించాయి. అంతకు ముందు ఏడాది మారుతీ 1,72,512 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది మే నెలలో అమ్మకాలు 1,34,641 కార్లకు పడిపోయిందని మారుతీ సుజుకీ ఇండియా తెలిపింది. దేశీయంగా మారుతీ సుజుకీ కార్ల విక్రయాలు 1,63,200 కార్ల నుంచి 1,25,552 కార్లకు పడిపోయింది. విశేషమేంటంటే మధ్య తరగతి ప్రజలు తమ బడ్జెట్ మేరకు ఎక్కువగా కొనుగోలుకు ఇష్టపడే మారుతీ ఆల్టో, వ్యాగన్ఆర్ వాహనాల విక్రయాలు గత మే మాసంలో గణనీయంగా 56.7 శాతం మేర క్షీణించాయి. అంటే వ్యవస్థలో మందగమనం కారణంగా ప్రజల వద్ద ఉన్న సొమ్ము వారి అవసరాలకే సరి పోతూ వస్తోందని.. ఈ కారణంగా వారు వాహ నాల కొనుగోలు దిశగా దృష్టి సారించడం లేదన్న సంగతి తేటతెల్లమవుతోందని విశ్లేషకులు చెబు తున్నారు. కాంపాక్ట్ విభాగంలోని స్విఫ్ట్, సెలీరి యో, ఇగ్నిస్, బాలినో, డిజైర్ వాహనాల అమ్మకా ల్లో 9.2 శాతం కుంగుదల నమోదు అయింది.
టాటా మోటార్స్ అమ్మకాలు 26% డౌన్..
శుక్రవారంతో ముగిసిన మే మాసంలో తమ కంపెనీ ప్యాసెంజర్ వాహనాల అమ్మకాలు 26 శాతం మేర క్షీణించినట్టుగా టాటా మోటార్స్ తెలిపింది. గత ఏడాది మే మాసంలో తాము మొత్తంగా 54,290 వాహనాలను విక్రయించగా.. ఈ ఏడాది మే నెలలో అమ్మకాలు 40,155 వాహనాలకే పరిమితం అయిందని కంపెనీ తెలిపింది. ఏప్రిల్-మే నెలలు కలుపుకొని చూస్తే దేశీయ అమ్మకాలను విశ్లేషిస్తే విక్రయాలలో దాదాపు 23 శాతం కుంగుదల కనిపించిందని కంపెనీ తెలిపింది. వాణిజ్య వాహనాల విక్రయాలను విశ్లేషిస్తే మే నెలలో 20 శాతం తగ్గుదల నమోదయినట్టుగా కంపెనీ తెలిపింది.
హోండా కార్ల అమ్మకాలు 28% డౌన్..
హోండా కార్స్ ఇండియా సంస్థ తమ కార్ల అమ్మకాలు మే నెలలో 28 శాతం మేర పడిపోయినట్టుగా శనివారం వెల్లడించింది. శుక్రవారంతో ముగిసిన మే నెలకు గాను హోండా కార్స్ ఇండియా సంస్థ 15,864 కార్లను విక్రయించగా.. ఈ ఏడాది అదే కాలానికి సంస్థ అమ్మకాలు 11,442కు పడిపోయింది. గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఇలాంటి తాము ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని హెచ్సీఐఎల్ సంస్థ సీనియర్ ఉపాధ్యక్షుడు, డైరెక్టర్ సేల్స్ రాజేష్ గోయల్ తెలిపారు. కాగా మరోవైపు టయోటా కిర్లోస్కర్ సంస్థ వాహన విక్రయాల్లో 6 శాతం క్షీణత కనిపించింది. మరోవైపు మహీంద్రా మహీంద్రా సంస్థ వాహన విక్రయాల్లో 3 శాతం తగ్గుదల కనిపించిందని ఆయా కంపెనీలు వెల్లడించాయి.
'డౌన్'ఫాల్కు అసలు కారణాలివే..
దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ప్రజలకు నగదు లభ్యత తగ్గింది. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న నోట్ల రద్దు వంటి అనాలోచిత నిర్ణయాల వల్ల చాలా కంపెనీలు, చిన్న సంస్థలు మూతపడ్డాయి. ఫలితంగా లక్షలాది మంది జీవనోపాధి కోల్పోయారు. మరోవైపు దేశంలో కొత్త కంపెనీలు రావడం లేదు. దీంతో ఉద్యోగాల సృష్టి జరగడం లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా కుదేలై పోయింది. సాగు సరిగ్గా సాగడం లేదు. అన్నదాత కష్టానికి తగిన ధర లభించడం లేదు. దీంతో రైతన్నలు తమకు లభించే సొమ్మును మళ్లీ పంటకు దాచుకోవడానికే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వాహనాల అమ్మకాల వైపు దృష్టి సారించడం లేదు. దీనికి తోడు ముడి సరుకుల ధరలు పెరగడంతో వాహన కంపెనీలు ఇటీవలి కాలంలో కార్ల ధరలను దాదాపు రూ.20 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు పెంచేశాయి. ఇది కూడా అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. మరోవైపు బీమా సంస్థలు కూడా ఇటీవల బీమా ప్రీమియం ధరలను విఫరీతంగా పెంచేశాయి. ఇది మార్కెట్పై ప్రభావం చూపుతోంది.