Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 553 పాయింట్లు ఎగబాకిన బీఎస్ఈ సూచీ..
- ఇంట్రాడేలో 40,309 మార్కును తాకిన సెన్సెక్స్ పరుగు
- 1.76 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద
- సరికొత్తగా ఆశలు రేపిన ఆర్బీఐ వడ్డీరేట్ల 'కోత'లు
ముంబయి: దేశీయ స్టాక్మార్కెట్లు సోమవారం జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. మందగమన పరిస్థితులతో వృద్ధి తగ్గుముఖం పడుతున్న వేళ.. ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించేందుకు గాను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) త్వరలో వెల్లడించనున్న ద్వైమాసిక సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలు సూచీలను ముందుకు నడిపించాయి. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్, ఐటీ, స్థిరాస్తి ఆర్థిక రంగాపు షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో సోమవారంతో ప్రారంభమైన కొత్ర ట్రేడింగ్ వారాన్ని మార్కెట్లు జోరుగా ప్రారంభమయ్యాయి. అటు చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం లాంటివి మార్కెట్ సెంటిమెంట్ను మరింత బలపర్చాయి. దీంతో ఆరంభం నుంచే దూకుడు మీదున్న సూచీలు కొత్త శిఖరాలను చేరుకున్నాయి. కొనుగోళ్ల అండతో సోమవారం నాటి ట్రేడింగ్ను సూచీలు ఉత్సాహంగా ప్రారంభించాయి. 200 పాయింట్ల లాభంతో ట్రేడింగ్ను ఆరంభించిన సెన్సెక్స్.. మధ్యాహ్నం తర్వాత మరింత జోరు పెంచింది. హెచ్డీఎఫ్సీ సహా ఇతర కీలక షేర్లు రాణించడంతో సరికొత్త శిఖరాలకు దూసుకెళ్లింది. సోమవారం నాటి ట్రేడింగ్లో సెన్సెక్స్ 553 పాయింట్లు ఎగబాకి 40,268 పాయింట్ల వద్ద ముగిసింది. ఇది సెన్సెక్స్ రికార్డు స్థాయి ముగింపు కావడం విశేషం. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ నిఫ్టీ 166 పాయింట్లు లాభపడి 12,088 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 69.29గా కొనసాగింది. సెన్సెక్స్లో 27 స్టాక్స్ లాభాల్లో నిలవగా..నాలుగు స్టాక్స్ నష్టపోయాయి. ప్రధానంగా హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్ స్టాక్ లాభాల్లో ముందుకు సాగుతూ మార్కెట్ను పరుగులు పెట్టించాయి. బీఎస్ఈలోని అన్ని రంగాల సాక్స్ లాభాల్లోనే నిలిచాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 0.90 శాతం మేర పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. గురువారం ఆర్బీఐ తన ద్వైమాసిక సమీక్షలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించనున్న నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు మార్కెట్లో ఇదే తరహా ర్యాలీ నమోదయ్యే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
1,76,402.37 కోట్లకు మార్కెట్ క్యాప్
బీఎస్ఈ సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 553 పాయింట్ల మేర రాణించి 40,268 పాయింట్లకు చేరుకోవడంతో సోమవారం ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.1.76 లక్షల కోట్ల మేర పెరిగింది. అంతకు ముందు సెన్సెక్స్ ఇంట్రాడేలో 594.7 పాయింట్ల మేర పెరిగి 40,308.90 పాయింట్ల గరిష్టాన్ని నమోదు చేసింది. ఇది సెన్సెక్స్కు జీవితకాల గరిష్టం కావడం గమనార్హం. మార్కె ట్లో నమోదైన వేగవంతమైన ర్యాలీతో బీఎస్ఈలో నమో దిత కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,56.14,416.92 కోట్ల నుంచి రూ.1,76,402 .37 కోట్లకు పెరిగింది. ఎన్ఎస్ఈలో ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టీసీఎస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, రిలయన్స్ ఇండిస్టీస్, హీరో మోటార్స్ షేర్లు లాభపడగా.. గెయిల్, టెక్ మహింద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో కాస్త ప్రతికూల పవనాలు కనిపించి మిశ్రమ ఫలితాలు కనిపించినప్పటికీ మదుపరులు మార్కెట్లో కొత్త కొను గోళ్లకు ఆసక్తి చూపడం విశేషం.