Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న పెన్నా సిమెంట్ ఇండిస్టీస్ రూ.1,550 కోట్ల పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ప్రతిపాదనకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ పచ్చజెండా ఊపింది. ఐపీవో నిమిత్తం సెబీ నుంచి కావాల్సిన అనుమతుల తమకు లభించినట్టుగా సంస్థ తెలిపింది. పెన్నా సిమెంట్ ప్రమోటర్ సంస్థ పీఆర్ సిమెంట్ హోల్డింగ్స్ రూ.1300 కోట్ల మేర నిధులను ఐపీవో ద్వారాను, రూ.250 కోట్ల మేర సొమ్మును ఆఫర్ ఫర్ సేల్ మార్గంలో సమీక్షించేందుకు వీలు కల్పిస్తూ సెబీ అనుమతులు జారీ చేసినట్టుగా సమాచారం. ఉత్పత్తి ప్రాతిపదికన పెన్నా సిమెంట్ సంస్థ దేశంలోని ప్రయివేటు దిగ్గజ సిమెంట్ కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో మూడు సిమెంట్ తయారీ కేంద్రాలను, రెండు గ్రైండింగ్ యూనిట్లను కలిగి ఉంది. సంవత్సరానికి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఈ సంస్థ సొంతం. ఐపీవో ద్వారా సమీకరించే నిధులతో పెన్నా సిమెంట్ సంస్థ తన వ్యాప్తిని తూర్పు, ఉత్తర, మధ్య భారతానికి కూడా విస్తరించాలని భావిస్తోంది. దీనికి తోడు ఇప్పటికే సంస్థకు ఉన్న కొంత రుణభారాన్ని కూడా తిరిగి చెల్లించడం, ముందస్తుగా చెల్లించడం వంటి కార్యకలాపాలను చేపట్టనున్నట్టుగా సంస్థ ఆర్హెచ్పీలో తెలిపింది. పెన్నా సిమెంట్ ప్రతిపాదిత ఐపీవోకు ఎడిల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్, జెఎం ఫైనాన్స్, యెస్ సెక్యూరిటీస్ (ఇండియా) సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరించనున్నారు.