Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బడ్జెట్లో ఈ దిశగా ప్రకటన!
- రుణ వితరణ పెంచడమే లక్ష్యం
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తుల సమస్యతో సతమతమవుతూ కునారిల్లుతున్న బ్యాంకులను తిరిగి జవసత్వాలు ఇచ్చే చర్యలను సర్కారు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులకు దాదాపు రూ.40,000 కోట్ల మేర మూలధన సాయాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయా బ్యాంకులు వేగంగా రుణాలను జారీ చేసేలా చూసేందుకు గాను ఈ చర్యలు తీసుకోవాలని సర్కారు యోచిస్తున్నట్టుగా సమాచారం. వచ్చే నెల 5న వెలువడనున్న బడ్జెట్లో ఈ దిశగా సర్కారు ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. నియంత్రణ సంస్థ నిబంధనలను పాటిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న బ్యాంకులను సాయం అందించేలా ఒక ప్రణాళికను సర్కారు ఇప్పటికే రూపొందించిందని సర్కారులో ఒక సీనియర్ అధికారి తెలిపారు. దేశంలో రుణాల వితరణలో వృద్ధిని అందుకోవడమే లక్ష్యంగా ప్రణాళిక రూపకల్పన జరుగుతోందని ఆయన అన్నారు. దాదాపు ఐదు బ్యాంకులు ఇప్పటికీ ఆర్బీఐ విధించిన సరైన దిద్దుబాటు చర్యల (పీసీఏ) ఫ్రేమ్వర్క్లో పని చేస్తున్నాయి. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరం బ్యాంకులకు కొత్త సత్తువనిచ్చేందుకు గాను ప్రభుత్వం దాదాపు రూ.1.6 లక్షల కోట్ల మేర మూలధన సాయాన్ని అందించింది. పీసీఏ నుంచి బయటపడిన బ్యాంకులకు ముఖ్యంగా ఈ సాయాన్ని అందించింది. అయితే ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రభుత్వం ఈ దిశగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్లో ఈ దిశగా ప్రకటన చేయాలని సర్కారు భావిస్తున్నట్టుగా సమాచారం. ఆర్థిక వ్యవస్థ మందగించి వృద్ధి పడిపోతున్న తరుణంగా వ్యవస్థలోకి మరిన్ని నిధులను అందుబాటులోకి తెచ్చి విరివిగా రుణాలను అందించాలనే ఉద్దేశంలో ఉన్న సర్కారు ఇందుకు అనుగుణంగా తొలత బ్యాంకులను బలోపేతం చేయాలని భావిస్తున్నట్టుగా సమాచారం. దాదాపు 10 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సర్కారు దాదాపు 75 శాతం వాటాను కలిగి ఉంది. దీంతో ఆయా బ్యాంకలను బలోపేతం చేయనున్నారు.
భారీ 'కోతకు అవకాశం..
భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) రేపు ప్రకటించనున్న పరపతి విధాన సమీక్ష నిర్ణయాలలో కీలక వడ్డీరేట్లను భారీగా తగ్గించేలా అనూహ్య నిర్ణయం తీసుకోనుందా? తాజా అంచనాలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సారథ్యంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సోమవారం ప్రారంభించింది. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, మార్చి త్రైమాసికంలో 5.8 శాతం వద్ద ఐదేండ్లలో కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేను ఈ సారి 0.35 శాతం లేదా 35 బేసిస్ పాయింట్లను తగ్గించే అవకాశం ఉందనే అంచనాలు భారీగా నెలకొన్నాయి. 0.25శాతం రేట్ కట్ ఉంటుందని ఇప్పటికే విశ్లేషకులు భావించినప్పటికీ ఏప్రిల్ మాస ద్రవ్యోల్బణం 2.92 శాతానికి చేరిన నేపథ్యంలో ఆర్బీఐ 35 బేసిస్ పాయింట్ల కోతకు మొగ్గు చూపే అవకాశం ఉందని మరికొందరు విశ్లేషిస్తున్నారు. ప్రధానంగా మే నెలలో ద్రవ్యోల్బణం 3.3 శాతానికి పెరగవచ్చని విదేశీ బ్రోకరేజ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా మెర్రిల్ లించ్ విశ్లేషకులు పేర్కొన్నారు. అలాగే గత నెలలో న్యూయార్క్లో ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంతదాస్ 0.25 శాతం లేదా అంతకంటే ఎక్కువ రేట్ కట్ ఉండవచ్చన్న ప్రసంగాన్ని సంస్థ గుర్తు చేస్తోంది. కాగా సోమవారం నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలు గురువారం వెలువడనున్నాయి.