Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాదాపు 15 లక్షల కోట్లతో హైవే గ్రిడ్ ఏర్పాటు
- నిలిచిన పనులు, రోడ్ల నిర్మాణాలు 100 రోజుల్లో షురూ
న్యూఢిల్లీ: దేశ ప్రజలు అభివృద్ధియే ధ్యేయంగా ఓట్లు వేసి తమను తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చారని జాతీయ రహదారులు, రవాణశాఖ, ఎంఎస్ఎంఈ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ సారి దేశ ప్రజలు అభివృద్ధి కోసం పార్టీ రాజకీయాలకు, కుల, మత విభజనలకు అతీతంగా ఓట్లు వేశారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో తాము అభివృద్ధియే లక్ష్యంగా అడుగులు వేయనున్నట్టుగా ఆయన తెలిపారు. గత ఐదేళ్లలో తన పనితీరు సంతృప్తికరంగా అనిపించిందని ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. రోజుకు 40 కిలోమీటర్ల రోడ్డు నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని గడ్కరీ తెలిపారు. రూ.15 లక్షల కోట్లతో హైవే గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్టుగా ఆయన వివరించారు. ఖాదీ, ఇతర చిన్న మధ్య తరహా రంగాలకు చెందిన ఉత్పత్తులను గ్లోబలైజ్ చేయడం ద్వారా జీడీపీ వృద్ధిరేటను పెంచడం లక్ష్యంగా పెట్టుకొన్నామని వెల్లడించారు. హైవేల నిర్మాణానికి బ్లూప్రింట్ సిద్ధమైంది. వీటిలో కనీసం 22 గ్రీన్ ఎక్స్ప్రెస్వేలు ఉంటాయన్నారు. వివిధ కారణాలతో ఇప్పటికే నిలిచిపోయిన ప్రాజెక్టులను మరో 100 రోజుల్లో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మొత్తం 225 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. వాటిల్లో చాలా వరకు ప్రాజెక్టులు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నాయన్నారు. వచ్చే 100 రోజుల్లో ఏ ప్రాజెక్టు పెండింగ్లో లేకుండా చేస్తామని తెలిపారు. పవర్ గ్రిడ్కు సమానంగా హైవే గ్రిడ్ ఏర్పాటు చేస్తామని వివరించారు.