Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రపంచలోని వివిధ ప్రధాన ఆర్థిక వ్యవస్థల వృద్ధితో పోలిస్తే భారత్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందని ప్రపంచ బ్యాంక్ తాజాగా అభివర్ణించింది. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7 శాతానికిపైగా కొనసాగుతోందని ప్రపంచ బ్యాంక్ నివేదిక వెల్లడించింది. భారత్ 2018-19 ఆర్థిక సంవత్సరానికి 7.2 శాతం వృద్ధిరేటు నమోదు చేసినట్లు బ్యాంక్ తన నివేదికలో విశ్లేషించింది. కాగా, మరోపక్క ఇదే ఆర్థిక సంవత్సరానికి మన ఆర్థిక వ్యవస్థ 6.8శాతం వృద్ధి రేటును నమోదు చేసినట్టుగా భారత కేంద్ర గణాంకాల సంస్థ ప్రాథమిక అంచనాల ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. 2018-19లో భారత్ 7.2 శాతం వృద్ధిని సాధించింది. ప్రభుత్వ వ్యయాలు తగ్గినా.. సర్కారు పెట్టుబడులు పెరిగాయని బ్యాంక్ పేర్కొంది. మౌలిక రంగంలో ప్రభుత్వం అత్యధికంగా ఖర్చు చేసిందని ఇది ఆర్థిక వ్యవస్థకు రానున్న రోజుల్లో మేలు చేయనుందని పేర్కొంది. 2020 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ జోరు కొనసాగుతుందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. 2020లో కూడా 7.5శాతం వృద్ధిరేటును సాధిస్తుందని అంచనా వేసింది. వచ్చే రెండేళ్లలో కూడా ఇదే వృద్ధి రేటును కొనసాగిస్తుందని పేర్కొంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న 'ఆర్థిక వ్యవస్థ'గా భారత్ కొనసాగుతుందని జోస్యం చెప్పింది. ద్రవ్య పరపతి విధానంలో తీసుకొనే చర్యలు, అత్యల్ప ద్రవ్యోల్బణానికి తోడు కేంద్రంలో కొత్తగా ఏర్పడిన సర్కారు సంస్కరణల పర్వంలో వేగం పెంచనుందన్న అంచనాలతో ఇది సాధ్యమవుతుందని బ్యాంక్ తెలిపింది. గత ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 3 శాతంగా అంచనా వేయగా.. ఈ ఏడాది అది 2.6 శాతం వృద్ధిని మాత్రమే నమోదు చేసిందని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి 2020లో 2.7 శాతంగాను, 2021లో 2.8 శాతంగాను ఉండొచ్చని విశ్లేషించింది.