Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీఎస్బీలను ముంచిన విజరు కలంత్రీ
- దిఘీ పోర్టు అభివృద్ధి పేరుతో రుణాలు..
- రుణాలు తీర్చు హోదా ఉన్నా ఎగవేతలు
- పేపర్లో ప్రకటనిచ్చిన బ్యాంక్ ఆఫ్ బరోడా
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) నుంచి భారీగా రుణాలు తీసుకొని ఎగవేసిన బడాబాబుల జాబితాలో తాజాగా మరో పారిశ్రామికవేత్త వచ్చి చేరారు. బాలాజీ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత, దిఘిపోర్టు డెవలపర్ విజరు గోవర్థన్దాస్ కలంత్రీ ఆయన కుమారుడు కలిసి బ్యాంకులకు దాదాపు రూ.3,334 కోట్ల మేర రుణాలను ఎగవేశారు. పోర్టు అభివృద్ధి పేరుతో వీరు దాదాపు 16 ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రూ.3500 కోట్ల మేర రుణాలను సమీకరించి.. ఆ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించడం లేదని రుణదాతల బ్యాంకు బృందానికి సారథ్యం వహిస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా (పూర్వపు విజయా బ్యాంక్) తెలిపింది. ఈ నేపథ్యంలో దిఘి పోర్టుకు చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న విజరు గోవర్థన్దాస్ కలంత్రీ, పోర్టు డైరెక్టర్ ఆయన కుమారుడు విశాల్ కలంత్రీలను బ్యాంక్ ఆఫ్ బరోడా ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటించింది. ఈ విషయమై బ్యాంక్ ఆఫ్ బరోడా (పూర్వం విజయ బ్యాంక్) ముంబయి స్థానిక వార్తా పత్రికల్లో ఒక పబ్లిక్ నోటీసును వెలువరించింది. ఆర్బీఐ నిర్ధేశించిన నిబంధనల మేరకు బ్యాంక్ నిబంధనల అనుసారం 1. దిఘి పోర్టు (రుణస్వీకర్తలు), 2. విశాల్ విజరు కలంత్రి దిఘి పోర్టు డైరెక్టర్ పూచీకర్త 3.విజరు గోవర్థన్దాస్ కలంత్రీ పోర్టు డైరెక్టరు, పూచీకర్తలు బ్యాంకుల నుంచి రుణాలను స్వీకరించి ఉద్దేశపూర్వకంగా వాటిని చెల్లించడం లేదని ప్రకటించింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కూడా సంబంధితులకు వెలువరించినా వారు తగిన చర్యలు తీసుకోవడం లేదని బ్యాంక్ వర్గాలు ఆ ప్రకటనలో తెలిపాయి. ఆర్బీఐ నిబంధనల మేరకు ఎగవేత అంశాన్ని వీలైనంత ఎక్కువ మందికి తెలిపేందుకు గాను బ్యాంక్ వర్గాలు వీరి ఫొటోలను కూడా ప్రచురించడం విశేషం. రాజ్పురి క్రీక్స్ తీరాన్ని కేంద్రంగా చేసుకొని దిఘీ పోర్టును అభివృద్ధి చేసేందుకు కలంత్రీ బ్యాంకుల నుంచి భారీగా రుణాలను స్వీకరించారు.
ఇప్పటికే దివాలా బాట..
ఇది మహారాష్ట్రలో మొట్టమొదటి ప్రయివేటు రంగ బ్యాంక్, అత్యాధునిక ఉపకరణాలు టెక్నాలజీతో దీనిని అభివృద్ధి పరిచారు. అయితే అనుకున్న స్థాయిలో డిమాండ్ ఏర్పడకపోవడంతో ఈ పోర్టు దివాలా బాట పట్టింది. గత ఏడాది మార్చి 25న ముంబయి కేంద్రంగా పని చేస్తున్న ఎన్సీఎల్టీ బెంచ్ ముందుకు దిఘీ పోర్టు దివాలా అంశం విచారణకు వచ్చింది. ఈ పోర్టుకు సంబంధించి జెఎన్పీటీ సమర్పించిన పునరుద్ధరణ ప్రణాళికకు ఎన్సీఎల్టీ సమ్మతి తెలిపింది. దీంతో పోర్టు జెఎన్పీటీ చేతుల్లోకి చేరింది. వివిధ పెద్దపెద్ద నిర్మాణ ప్రాజెక్టులను చేపడుతున్న కలంత్రీని ఇప్పడు బ్యాంకులు మోసగాడిగా గుర్తించడంతో కార్పొరేట్ ప్రపంచం ఒక్కసారిగా నివ్వెరపోయింది.