Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లోలో గురువారం వినూత్న పరిణామం చోటు చేసుకుంది. ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్టుగా ప్రకటించినప్పటికీ దేశీయా మార్కెట్లు కుప్పకూలాయి. సాధారణంగా కీలక వడ్డీరేట్లలో ఆర్బీఐ కోత విధించినపుడు సహజంగా స్టాక్మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తాయి. ముఖ్యంగా బ్యాంకింగ్ షేర్ల కొనుగోళ్లపై ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తారు. దీంతో కీలక వడ్డీరేటు కోతతో బ్యాంకింగ్ సెక్టార్, స్థారాస్తి, ఆటోమొబైల్ స్టాక్స్ భారీగా లాభపడుతాయి. కానీ మార్కెట్ గురువారం దీనికి భిన్నంగా స్పందించింది. వడ్డీరేట్లు తగ్గిస్తున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించినప్పటికీ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో స్టాక్మార్కెట్ ఇంట్రాడేలో ఏకంగా 600 పాయింట్ల పతనానికి చేరువైంది. చివర్లో కోలుకున్నా 554 క్షీణించి, సెన్సెక్స్ 40వేల దిగువకు, 178 పాయింట్లు పతనమైన నిఫ్టీ 12వేల దిగువకు చేరాయి. ఇందుకు ప్రధాన కారణాలు ఇలా ఉన్నాయి.. ద్రవ్య సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్బీఐ పాలసీ ప్రకటనలో ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం ఆందోళనకలిగించింది. తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్న బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ)ల భవిష్యత్తు నిర్ణయించేలా ఎలాంటి నిర్ణయం వెలువడలేదు దీంతో మార్కెట్లు నిరుత్సాహ పడ్డాయి. ట్రేడ్వార్ భయాలు, తద్వారా అంతర్జాతీయంగా క్షీణించిన డిమాండ్ లాంటి అంశాలపై కేంద్ర బ్యాంకు ఆందోళన వ్యక్తం చేసింది. ఇది భారత ఎగుమతులు, పెట్టుబడులను ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. దీంతో మార్కెట్ల సెంటిమెంట్ దెబ్బతింది. 2019-20 సంవత్సరానికిగాను ఆర్బీఐ దేశ వృద్ధిరేటు అంచనాలను 7.2 శాతం నుండి 7 శాతానికి తగ్గించింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అంతర్జాతీయంగా పెరుగుతున్న ట్రేడ్వార్ ఆందోళన పెట్టుబడిదారుల్లో అసంతృప్తికి కారణమైంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ క్రిస్టీన్ లాగార్డే బుధవారం మాట్లాడుతూ టారిఫ్ బెదిరింపులు వ్యాపారాన్ని, మార్కెట్ విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయని వ్యాఖ్యానించారు. దీంతో వచ్చే ఏడాది వృద్ధిరేటు మందగిస్తుందన్న అంచనాలు వెలువడ్డాయి. దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ (డిహెచ్ఎఫ్ఎల్) పై క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు క్రిసిల్, ఐక్రా, కేర్ రేటింగ్ను బాగా తగ్గించడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.