Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెపో రేటులో మరో పావు శాతం కోత..
- తొమ్మిదేండ్ల కనిష్టానికి దిగివచ్చిన రెపో రేటు
- గృహ, వాహన రుణాలు, ఈఎంఐ మరింత చౌకొ 5.50 శాతానికి చేరుకున్న రివర్స్ రెపో రేటు..
- వృద్ధిరేటు అంచనాలు మరింత కిందికి
- ఆన్లైన్ లావాదేవీలపై బ్యాంక్ చార్జీల ఎత్తివేత
- ఏటీఎం చార్జీలను సమీక్షించేందుకు కమిటి: ఆర్బీఐ
ముంబయి: దేశ పెద్దబ్యాంకైన భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోమారు తీపి కబురును వెల్లడించింది. విశ్లేషకుల అంచనాలను నిజం చేస్తూ కీలక వడ్డీ రేట్లను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ రెండో ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని నిర్ణయాలను ఆర్బీఐ గురువారం వెల్లడించింది. తాజా సమీక్షలో రెపో రేటుపై పావు శాతం కోత విధించాలని ఆర్బీఐ నిర్ణయిం చింది. తాజా నిర్ణయంతో ప్రస్తుతం రెపో రేటు 6శాతంగా ఉండగా.. అది 5.75శాతానికి దిగిరానుంది. రివర్స్ రెపో రేటు, బ్యాంక్ రేటును ఆర్బీఐ వరుసగా 5.50 శాతం, 6 శాతానికి సవరించింది. పరపతి విధాన సమీక్షలో ఈ సవరణలకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ద్రవ్యపరపతి విధాన సమీక్షకు మానిటరీ పాలసీ కమిటీ ఏర్పాటైన తరువాత ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవడం ఇదేమొదటిసారి. బ్యాంకులకు ఆర్బీఐ అందించే స్వల్పకాల రుణాలపై విధించే వడ్డీని రెపో రేటుగా పరిగణిస్తారు. రెపో రేటు తగ్గడంతో తదనుగుణంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది. బ్యాంకులు వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని మళ్లిస్తే ఆయా రుణాలపై వారు చెల్లించే నెలసరి వాయిదా (ఈఎంఐ)లు కొంత మేర దిగివస్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 3.0-3.1శాతంగా, రెండో అర్ధ భాగంలో 3.4-3.7శాతంగా ఉండొచ్చని ఆర్బీఐ అంచనా కట్టింది.జీడీపీ అంచనాలను 7శాతానికి సవరింపు. అంతకుముందు జీడీపీ 7.2శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. తదుపరి ఎంపీసీ భేటీ ఆగస్ట్ 5 నుంచి 7 వరకూ జరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది. ఏటీఎం చార్జీలను పరిశీలించేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు ఏర్పాటు చేయాలని ఆర్బీఐ నిర్ణయించింది.
తొమ్మిదేండ్ల కనిష్టానికి చేరువలో..
కీలక వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్బీఐ ఎంపీసీ తీసుకున్న నిర్ణయంతో రెపో రేటు తొమ్మిదేండ్ల కనిష్టానికి చేరింది. 2010 జులై తర్వాత రెపో రేటు 5.50 శాతంగా ఉండగా.. ఆ తర్వాత దాదాపు తొమ్మిదేండ్ల తరువాత రెపోరేటు ఆరు శాతం దిగువకు చేరింది. కాగా.. వడ్డీరేట్ల తగ్గింపుతో స్టాక్ మార్కెట్లలో బ్యాంకింగ్ షేర్లు కుదేలయ్యాయి. తాజా నిర్ణయంతో ఆర్బీఐ వరుసగా మూడు సమీక్షల్లోనూ వడ్డీరేట్లను తగ్గించినట్టయింది. ఆర్బీఐ నిర్ణయంతో గృహ, వాహన రుణాలపై వడ్డీభారం తగ్గనుంది. దేశీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించడం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో వడ్డీరేట్లను తగ్గించాలని ఆర్బీఐ నిర్ణయించినట్టుగా సమాచారం. పెట్టుబడుల మందగమనంతో పాటు ప్రైవేట్ వినిమయంలో వృద్ధి ఆశించిన మేర లేకపోవడంతో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు మొగ్గుచూపింది.
ఖాతాదారులకు 'డిజిటల్' ఊరట..
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చేసే నగదు బదిలీలపై చార్జీలను తొలగిస్తున్నట్టుగా గురువారం వెల్లడించింది. సమీక్ష నిర్ణయాలను ప్రకటిస్తూ ఈ విషయాన్ని తెలియజేసింది. బ్యాంకులు ఈ ప్రయోజనాలను తమ ఖాతాదారులకు బదిలీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించింది. ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ కోసం రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ సిస్టమ్ (ఆర్టీజీఎస్), రూ.2లక్షల వరకు నగదు లావాదేవీల కోసం నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ (ఎన్ఈఎఫ్టీ) వ్యవస్థను ఖాతాదారులు ఎక్కువగా ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఈ డిజిటల్ లావాదేవీలకు గాను బ్యాంకులు ఇప్పటి వరకు చార్జీలను వసూలు చేస్తూ వస్తున్నాయి. ప్రభుత్వరంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఎన్ఈఎఫ్టీ లావా దేవీలపై రూ. 1 నుంచి రూ. 5 వరకు, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ. 5 నుంచి రూ. 50 వరకు చార్జీలు వసూలు చేస్తోంది. సాధారణంగా ఈ లావాదేవీలపై బ్యాంకుల నుంచి ఆర్బీఐ చార్జీలు వసూలు చేస్తుండటంతో బ్యాంకులు ఖాతాదారుల నుంచి రుసుము తీసుకుంటున్నాయి. అయితే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గానూ ఈ చార్జీలను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంకులు కూడా ఈ ప్రయోజనాలను ఖాతాదారులకు బదిలీ చేయాలని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి వారంలోగా అన్ని బ్యాంకులకు సూచనలు జారీ చేస్తామని తెలిపింది.
త్వరలోనే ఏటీఎం చార్జీల సమీక్ష..
ఏటీఎం (స్వయం చలితి నగదు యంత్రాల) చార్జీలు, ఫీజు తగ్గించే అంశంపై త్వరలో కసరత్తు చేయనున్నట్టుగా ఆర్బీఐ ప్రకటించింది. ఈ లావాదేవీలపై చార్జీల విషయంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ విషయ సమీక్షకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్బీఐ గురువారం ప్రకటించింది. ఒక బ్యాంకు కార్డుతో వేరే బ్యాంకుకు చెందిన ఏటీఎం కేంద్రాన్ని వాడినందుకు గానూ చెల్లించాల్సిన మొత్తాన్ని ఈ కమిటీ నిర్ణయిస్తుంది. ఏ బ్యాంకు కార్డుదారులైనా వేరే బ్యాంకు ఏటీఎంలలో లావాదేవీలు జరపొచ్చు. అయితే, వీటి సంఖ్యపై పరిమితి ఉంది. అంతకు మించిన సంఖ్యలో లావాదేవీలు జరిపినప్పుడు కొంతమొత్తం చెల్లించాల్సి వస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఏటీఎం ఇంటర్ చార్జీలు, ఫీజు విధానాన్ని సమీక్షించేందుకు త్వరలో ఓ కమిటీని వేయనున్నట్టుగా ఎంపీసీ సమీక్ష అనంతరం ఆర్బీఐ ప్రకటించింది. నెఫ్ట్, ఆర్టీజీఎస్ల ద్వారా చేపట్టే ఆన్లైన్ ట్రాన్స్ ఫర్లపై చార్జీలను తొలగించి ఆయా లావాదేవీలు ఉచితం గా అందుబాటులోకి తీసుకొ చ్చిన ఆర్బీఐ ఏటీఎం చార్జీల విషయంలో కూడా బ్యాంకు ఖాతాదారులకు భారీ ఊరట నిచ్చే అవకాశాలు కనిపిసు ్తన్నాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు. తమ సూచనలను, సలహాలను తమ మొదటి సమావేశం తర్వాత, రెండు నెలల్లో ఇవ్వాల్సి ఉంటుంద న్నారు. కమిటీ ఇచ్చిన సూచనలకు ఆ తర్వాత వారం రోజుల్లో విధి విధానాలను వెలురిస్తామని పేర్కొంది. దీంతో వేరే బ్యాంకు ఏటీఎంలను వాడినందుకు గాను చెల్లించే చార్జీలు త్వరలో మారే అవకాశాలున్నాయి. మరోవైపు నష్టాలకు ఆస్కారం లేకుండా చార్జీలను సవరించాలని ఏటీఎం ఇండిస్టీ కాన్ఫెడరేషన్ సైతం డిమాండ్ చేస్తోంది.