Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిద్ధమవుతున్న నిషేధపు బిల్లు
న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీగా ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న క్రిప్టోకరెన్సీ లావాదేవీలను నియం త్రించేందుకు గాను కఠినంగా వ్యవహరించాలని సర్కారు భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలో అమలులోకి తేనున్న '''బ్యానింగ్ ఆఫ్ క్రిప్టోకరెన్సీ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు-2019''లో కఠిన శిక్షలను సర్కారు ప్రతిపాదిస్తున్నట్టుగా సమాచారం. బిట్కాయిన్ లాంటి వివిధ రకాల డిజిటల్ కరెన్సీ మైనింగ్ చేయడం, తమ ఖాతాల్లో నిల్వ ఉంచుకోవడం, ఇతరులకు బదిలీ చేయడం, జారీ చేయడం, లావాదేవీలను జరపితే ఇకపై దాదాపు 10 ఏండ్ల పాటు జైలు శిక్ష విధించేలా చట్టాన్ని రూపొందిస్తున్నట్టుగా సమాచారం. ఈ బిల్లులో క్రిప్టోకరెన్సీని పూర్తిగా చట్టవిరుద్ధమై ప్రక్రియగా ప్రకటించడంతో పాటు ఈ తరహా కరెన్సీని కలిగి ఉండడం నాన్ బైయిలబుల్ నేరంగా పరిగణించాలని బిల్లులో సర్కారు ప్రతిపాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంటర్నెట్ వేదికగా చెలామణి అవుతున్న క్రిప్టోకరెన్సీ వాడకం ఎక్కువగా దుర్వినియోగమవుతూ అజ్ఞాత ఆర్థిక నేరాలు పెరగడానికి కారణమవుతున్న నేపథ్యంలో దేశంలో దీనిని పూర్తిగా నిషేధించాలని సర్కారు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. క్రిప్టో కరెన్సీ నిషేధ ముసాయిదా బిల్లు రూపకల్పనపై ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి నేతృత్వంలోని బృందం కసరత్తు చేస్తోంది. క్రిప్టో కరెన్సీపై కఠిన వైఖరిని పాటించనున్న నేపథ్యంలో ఆర్బీఐ నేతృత్వంలో త్వరలో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తెచ్చే విషయంలో సర్కారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు.