Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మే మాసంలో 97.3కు పడిన ఐసీఐ..
- భవిష్యత్తు పైనా సడలుతున్న నమ్మకం
- వృద్ధిలో మందగమనమే ప్రధాన కారణం
- ప్రభావం చూపుతున్న నిరుద్యోగం: ఆర్బీఐ
న్యూఢిల్లీ: వృద్ధిలో మందగమనం, ఉద్యోగ అవకాశాలు అంతకంతకు తగ్గిపోతూ నిరుద్యోగం పెరుగుతుండడంతో దేశ ఆర్థిక వ్యవస్థపై భారతీయుల్లో విశ్వాసం సన్నగిల్లుతూ వస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంకే (ఆర్బీఐ) శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారతీయుల్లో ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం బాగా సన్నగిల్లినట్టుగా ఆర్బీఐ నిర్వహించిన 'భారతీయ వినియోగదారుల విశ్వాస సర్వే'లో తేలింది. మార్చిలో 104.6గా ఉన్న భారతీయ వినియోగదారుల సూచీ (ఐసీఐ) మే మాసం ముగింపు నాటికి 97.3 పాయింట్లకు పడిపోయినట్టు ఆర్బీఐ తన నివేదికల తెలిపింది. ఐసీఐ వంద కంటే తక్కువగా ఉంటే విశ్వాస దోరణి నిరాశాజనకంగా ఉన్నట్టుగాను.. 100 పాయింట్ల కంటే ఎక్కువగా ఉంటే విశ్వాసం ఆశాజనకంగాను ఉన్నట్టుగా ఈ సూచీ తెలుపుతుంది. ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై కూడా భారతీయుల్లో విశ్వాసం పడిపోయినట్టుగా సర్వే తేల్చింది. గత మే నెలలో 'భవిష్యత్తు అంచనాల సూచీ' (టీఎఫ్ఐ) కూడా పడిపోయినట్టుగా ఆర్బీఐ వెల్లడించింది. భారత్లో భవిష్యత్తు ఆశావాదం క్షీణిస్తుండడంతో మార్చిలో 133.4 పాయింట్ల దరిదాపుల్లో ఉన్న భవిష్యత్తు అంచనా సూచీ మే మాసంలో 133.4 పాయింట్లకు పడిపోయిందని ఆర్బీఐ సర్వేలో తేలింది. దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారతీయుల్లో విశ్వాసం క్షీణించడానికి ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి అని ఆర్బీఐ తన నివేదికలో తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో వినిమయం, పెట్టుబడులను పెంచేందుకు గాను విధానకర్తలు ఎదుర్కొంటున్న సవాళ్ల కారణంగా సెంటిమెంట్ దెబ్బతింటోందని ఆర్బీఐ వివరించింది. ఆర్థిక వృద్ధి 2014 నాటి కనిష్ట స్థాయిలకు చేరడం కూడా సెంటిమెంట్పై ప్రభావం చూపుతూ వస్తోందని పెద్ద బ్యాంక్ విశ్లేషించింది. ప్రయివేటు పెట్టుబడులలో స్తబ్దతతో పాటు జీడీపీలో దాదాపు 60% వాటా కలిగిన రవాణ, వాహనాల విక్రయం వంటి విభాగాల్లో క్షీణత కూడా విశ్వాసంపై ప్రభావం చూపుతోందని నివేదిక తెలిపింది. దీనికి తోడు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల్లో నెలకొన్న సంక్షోభం కూడా భారతీయుల విశ్వాసంపై ప్రభావం కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపోరేటు తొమ్మిదేండ్ల కనిష్ట స్థాయికి చేరిన విషయం విధితమే. వడ్డీరేట్లను తగ్గించడం ద్వారా మళ్లీ వృద్ధిని పట్టాలెక్కించడంతో పాటు వ్యవస్థలో విరివిగా నగదు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఆర్బీఐ నిర్ణయించింది. దాదాపు దేశంలోని 13 నగరాలలోని భారతీయులను వివిధ ఆర్థిక అంశాలపై ప్రశ్నించిన ఆర్బీఐ ఈ సర్వే నివేదికను వెల్లడించింది.
ఎన్పీఏ ప్రకటనకు కొత్త నిబంధనలు
- 30 రోజుల గడువుతో కొత్త విధానం
- సుప్రీం తీర్పునేపథ్యంలో ఆర్బీఐ కొత్త సర్క్యూలర్
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తుల సమస్యను పరిష్కరించే దిశగా బ్యాంకులు పాటించాల్సిన కొత్త విధివిధానాలను భారతీయ రిజర్వు బ్యాంకు శుక్రవారం ప్రకటించింది. ఒత్తిడిలో ఉన్న ఆస్తుల విషయంలో బ్యాంకులు వ్యవహరించాల్సిన విధివిధాలను వెల్లడిస్తూ గత ఏడాది ఏప్రిల్ 12న ఆర్బీఐ ఒక సర్క్యూలర్ను వెల్లడించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం రుణ చెల్లింపు గడువు దాటిన మరుసటి రోజే సదరు రుణాన్ని నిరర్థక ఆస్తిగా ప్రకటించే వారు. దీనిపరిష్కారానికి గాను ఆరు నెలల గడువుతో నోటీసులు ఇచ్చే వారు. గడువు ముగిసే లోపు రుణం చెల్లించకపోవడం లేదా తగిన పరిష్కారం కనబరచకపోతే సదరు రుణ స్వీకర్తను దివాలా కోర్టుకు ఈడ్చి పునరుద్ధరణ ప్రణాళికల ద్వారా రుణ పరిష్కారాన్ని కనుగొనేవారు. దీనిని దేశంలోని కార్పొరేట్ లాబీయింగ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దీనిపై అటు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తూనే న్యాయపోరాటం చేసింది. మాజీ ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తన పదవికి రాజీనామా చేసేలా ఒత్తిడి తెచ్చిన అంశాల్లో ఈ సర్క్యూలర్ రద్దు కూడా ఒక అంశంగా చెప్పవచ్చు. సుప్రీం కోర్టు ఆదేశాలనుసారం ఆర్బీఐ తాజా నిబంధనల తయారు చేసి ప్రకటించింది. వీటి అనుసారం ఒత్తిడిలో ఉన్న రుణాలు, ఆస్తుల రుణ చెల్లింపుల గడువు ముగిసిన 30 రోజుల వరకు నిరర్థక ఆస్తులుగా ప్రకటించేందుకు వీలు ఉండదు. గతంలో అమలులో ఉన్న రుణ పరిష్కార ప్రణాళిక, నిబంధనావళి, కార్పొరేట్ రుణాల పునర్నిర్మాణ పథకం, ఎస్డీఆర్, ఎస్4ఏ విధానాల స్థానంలో కొత్త విధానాలు అమలులోకి రానున్నాయి. అయితే కొత్త సర్య్యూలర్ ప్రకారం కూడా ఆదిలోనే ఒత్తిడిలో ఉన్న రుణాలను గుర్తించడం, వాటిని బ్యాంకులకు తెలియపరచడంతో పాటు వాటికి కాల పరిమితితో కూడిన పరిష్కారం కనుగొనేందుకు వీలుకలుగనుంది ఆర్బీఐ తెలిపింది.