Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్లో ఇండియన్ బ్యాంక్ ప్రత్యేక కార్పొరేట్ శాఖను ఏర్పాటు చేయనున్నట్టుగా ఆ బ్యాంక్ ఎండీ, సీఈవో పద్మజా తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆర్థిక జోడింపు ఆభివృద్ధి పథకాల్లో ఇండియన్ బ్యాంక్ కీలక భాగస్వామిగా తన వంతు సహాయ సహకారాలను అందిస్తోందని ఆమె తెలిపారు. హైదరబాద్ జోన్ కేంద్రంగా ఏర్పాటు చేసిన ఇండియన్ బ్యాంక్ కార్పొరేట్ క్లయింట్ మీట్ కార్యక్రమంలో పద్మజా పాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొంటూ ఇండియన్ బ్యాంక్ ప్రగతి పథంలో దూసుకుపోతోందని ఆమె వివరించారు. తమ వృద్ధిలో భాగస్వాములుగా ఉంటున్న విశ్వసనీయమైన ఖాతాదారులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఇండియన్ బ్యాంక్ మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.4.30 లక్షల కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. బ్యాంక్ రుణాల పోర్టుఫోలియా 15 శాతం వృద్ధితో 1.88 లక్షల కోట్లకు చేరుకుంది. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి బ్యాంక్ రూ.321 కోట్ల మేర లాభాన్ని నమోదు చేసినట్టుగా ఎండీ తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జోన్కు చెందిన బ్యాంక్ ఉన్నతాధికారులు, బ్యాంక్ మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. కొర్పరేట్ మీట్కు తెలుగు రాష్ట్రాలలోని వివిధ కార్పొరేట్ ప్రముఖులు హాజరయ్యారు.