Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వీడియోకాన్ సంస్థకు రుణాల మంజూరీలో అక్రమాలకు పాల్పిడిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో చందా కొచ్చర్కు ఇప్పట్లో విముక్తి లభించే అవకాశాలు కనిపించడం లేదు. వీడియోకాన్ రుణాల మంజూరు వ్యవహారంలో మనీలాండరింగ్తో పాటు క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 10న ఢిల్లీలో ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరుకావాలని కోరింది. తొలుత ఈ నెల 6నే హాజరు కావాలని ఈడీ సూచించింది. అయితే కొన్ని కారణాల రీత్యా తాను ఆ రోజు హాజరుకాలేనని, విచారణను మరో రోజుకు మార్చాలని చందా కొచ్చర్ విజ్ఞప్తి చేశారు. కొచ్చర్ అభ్యర్థనను అంగీకరించిన ఈడీ.. వచ్చే సోమవారం దర్యాప్తునకు రావాలని సమన్లు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధించి గత నెలలోనూ చందా కొచ్చర్ దంపతులు దర్యాప్తునకు హాజరైన విషయం తెలిసిందే. మే 13 నుంచి 17 వరకు ఐదు రోజుల పాటు ఈడీ అధికారులు కొచ్చర్ దంపతులను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అంతకుముందు ఈ కేసుకు సంబంధించి ముంబయి, ఔరంగాబాద్ ప్రాంతాల్లో ఉన్న చందా కొచ్చర్, ఆమె కుటుంబ సభ్యులు, వీడియోకాన్ గ్రూప్నకు చెందిన వేణుగోపాల్ ధూత్ ఇళ్లలో సోదాలు చేసిన అనంతరం ముంబయిలోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో వారిని విచారించిన సంగతి తెలిసిందే.