Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేలంలో ఓఐఎల్కు 12, వేదాంతకు తొమ్మిది: రిపోర్టు
న్యూఢిల్లీ : కేంద్రం తాజాగా నిర్వహించిన వేలంలో ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్ప్(ఓఎన్జీసీ) తొమ్మిది ఆయిల్ మరియు గ్యాస్ క్షేత్రాలను సొంతం చేసుకోనున్నట్టు సమాచారం. అలాగే, అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత కూడా తొమ్మిది బ్లాకులు, ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్(ఓఐఎల్) 12 క్షేత్రాలను గెలుచుకోనున్నాయి. రిలయన్స్ ఇండిస్టీస్.. భాగస్వామ్య బ్రిటీష్ కంపెనీ బీపీతో కలిసి బంగాళాఖాతంలోని కృష్ణా గోదావరి బేసిన్ క్షేత్రానికి బిడ్ వేసింది. ఈ బ్లాక్లో ఓఎన్జీసీ కంటే ఎక్కువ బిడ్ వేసి ముందంజలో ఉన్నట్టు తెలిసింది. కాగా, 32 ఆయిల్, గ్యాస్ క్షేత్రాలకు తాజాగా నిర్వహించిన వేలంలో వచ్చిన బిడ్ల పరిశీలన ప్రక్రియ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ పూర్తి చేసినట్టు సంబంధితవర్గాలు తెలిపాయి. ఈ పరిశీలన ప్రకారం.. ఓఎన్జీసీ తొమ్మిది క్షేత్రాల్లో, వేదాంత తొమ్మిది బ్లాకుల్లో టాప్ బిడ్డర్స్గా ఉన్నట్టు తెలిసింది. కాగా, ఓఐఎల్ 12 క్షేత్రాల్లో ఎక్కువ బిడ్ వేసినట్టు సమాచారం. ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తర్వాత ఈ వేలంలో గెలుపొందిన కంపెనీల పేర్లు ప్రకటించనున్నారు.