Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్షీణించిన ఆర్థిక వృద్ధిరేటు.....పెరిగిన నిరుద్యోగిత
- రెండు క్యాబినెట్ కమిటీలకు బాధ్యత
- కొత్త సీసాలో పాత సరుకులాంటిదేనా..?
న్యూఢిల్లీ: గత ఐదేండ్ల కాలంలో క్షీణించిన ఆర్థిక వ్యవస్థను తిరిగి అభివృద్ధి బాట పట్టించాలని మోడీ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. మరోవైపు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యామని రెండోసారి అధికారం చేపట్టిన వెంటనే మోడీ సర్కార్ పరోక్షంగానైనా అంగీకరించిన విషయం తెలిసిందే. మే 31న దేశంలోని నిరుద్యోగితపై అధికారికంగా వెల్లడించిన గణాంకాలు ఈ ఏడాది జనవరిలో లీకైన ఎన్ఎస్ఎస్వో నివేదికను యథార్థమని తేల్చాయి. దేశంలోని నిరుద్యోగిత 6.1 శాతానికి చేరినట్టు అధికారిక గణాంకాల్లో తేటతెల్లమైంది. ఇది 45 ఏండ్ల గరిష్టమని లీకైన నివేదిక ఇప్పటికే స్పష్టం చేసింది. దాంతో, దిద్దుబాటు చర్యలకు మోడీ నేతృత్వంలోని నూతన సర్కార్ సిద్ధమవుతున్నట్టుగా సంకేతాలిస్తోంది. అందులో భాగంగానే ఓ క్యాబినెట్ కమిటీని ఉద్యోగాలపై, మరో కమిటీని ఆర్థిక వృద్ధిపై ఏర్పాటు చేస్తున్నట్టు మోడీ సర్కార్ ప్రకటించింది. అయితే, ఒక్క అమిత్షా మినహా ఈ కమిటీల్లో కొత్తవారెవరూ లేకపోవడం గమనార్హం. మిగతా వారంతా గత మోడీ క్యాబినెట్లోని మంత్రులే. అనారోగ్య కారణాల వల్ల ఈసారి మంత్రివర్గంలో చేరలేకపోయిన మాజీ ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ స్థానంలోకి గత సర్కార్లో రక్షణమంత్రిగా పని చేసిన నిర్మలాసీతారామన్ను తీసుకున్నారు. ఈ స్వల్ప మార్పులతో గత సర్కార్కన్నా సృజనాత్మక వ్యూహ రచనలు, ప్రణాళికల్ని ఎవరైనా ఊహించగలరా..?
జీఎస్టీని అమలులోకి తేవడం వల్ల ఆదాయం పెరుగుతుందంటూ ఇప్పటివరకూ మోడీ సర్కార్ చెప్పిన అంచనాలన్నీ తప్పని వాస్తవ గణాంకాల్లో తేలింది. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్(సీజీఏ) నివేదిక ప్రకారం 2016-17లో జీడీపీలో 9.4 శాతంగా ఉన్న పన్నుల ఆదాయం, 2018-19కి 8.8 శాతానికి పడిపోయింది. పన్నుల ఆదాయం నుంచి రాష్ట్రాలకు బదిలీ చేసేది పోగా కేంద్రం వాటా 2014లో జీడీపీలో 7.2 శాతం ఉండగా, 2018-19లో 6.9 శాతానకి తగ్గింది. 2012-13లో(యూపీఏ పాలనలో) ఇది 7.5 శాతంగా ఉండటం గమనార్హం.
జేఎన్యూలోని ఆర్థికశాస్త్రం ప్రొఫెసర్ సూర్జిత్ మొజుందార్ ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరి 1న పున:సమీక్ష అంచనాకన్నా 2018-19లో కేంద్ర పన్నుల ఆదాయం రూ.1.67 లక్షల కోట్లు తగ్గింది. దీంతో, ద్రవ్యలోటును నిర్ణీత టార్గెట్కు అనుగుణంగా తగ్గించడం కోసం ప్రభుత్వ ఖర్చుల్ని కేంద్రం 94 శాతంమేర తగ్గిస్తోందని, ఈ కోతల్లో సగం ఆహార సబ్సిడీలని మొజుందార్ అంచనా. గత ఐదేండ్లలోనూ మోడీ సర్కార్ సంక్షేమ పథకాల నిధుల్ని తగ్గించినట్టు సీజీఏ డేటాను విశ్లేషిస్తే అర్థమవుతుంది. యూపీఏ చివరి ఏడాది 2013-14లో ప్రభుత్వ ఖర్చు జీడీపీలో 13.9 శాతం కాగా, ఆ మరుసటి ఏడాది మోడీ పాలనలో(2014-15లో) 13.2 శాతానికి తగ్గింది. 2018-19 వరకల్లా అది 12.2 శాతానికి తగ్గింది. ఆర్థిక వృద్ధిరేట్ తగ్గడం వల్లే సంక్షేమ పథకాలకు మోడీ సర్కార్ కోత పెడుతోందన్నది గమనార్హం.
జీడీపీ వృద్ధిరేట్ మోడీ-1 హయాంలో చివరి ఏడాది 2018-19లో 6.8 శాతంగా నమోదైంది. ఇది ఐదేండ్ల కని ష్టం. అదే ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధిరేట్ 5.8 శాతంగా నమోదైంది. ఇది 20 త్రైమాసికాల కనిష్టం.
జీడీపీ వృద్ధిరేట్ మందగించడంతో సహజంగానే నూతన ఉద్యోగాల కల్పన తగ్గి, నిరుద్యోగిత తారాస్థాయికి చేరుకున్నట్టు పలు సర్వే సంస్థల అంచనాల్లో తేలింది. సీఎంఐఈ సర్వే ప్రకారం జనవరి నుంచి ఏప్రిల్ వరకు 2017లో 7.66 శాతమున్న నిరుద్యోగిత, అదే కాలంలో 2019లో 9.35 శాతానికి పెరిగింది. పనిలో చేరేందుకు అర్హులైన 15 ఏండ్ల పైవయసువారిని లెక్క వేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించారు.
సంక్షేమ పథకాలకు కోత విధించడం వల్ల జీడీపీ వృద్ధిరేట్ పెరుగుతుందనేది భ్రమేనని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం, అందుకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచడం ద్వారానే జీడీపీ వృద్దిరేట్ పెరుగుతుందని వారు సూచిస్తున్నారు. దీంతో, నూతన ఉద్యోగాలూ పెరుగుతాయని వారు చెబుతున్నారు. ఇప్పుడు ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ఈ రెండు క్యాబినెట్ కమిటీలు ఎలాంటి సూచనలు చేస్తాయి..? విధానపరంగా మోడీ సర్కార్ తీసుకోనున్న సరికొత్త ఆర్థిక నిర్ణయాలు ఏవిధంగా ఉండనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది.