Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: ప్రముఖ ఆర్థికవేత్త, భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ బ్రిటన్లోని 'బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్' గవర్నర్ పదవికి పోటీ పడుతున్నారు. బ్రిటన్ పెద్దబ్యాంక్ పగ్గాలు చేపట్టేందుకు పోటీపడుతున్న ప్రముఖ వ్యక్తుల్లో ఆయన ఒకరుగా ఉన్నారని బ్లూమ్బెర్గ్ టీవీ చానెల్ వెల్లడించింది. బ్రెగ్జిట్ నేపథ్యంలో ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్గా ఉన్న మార్క్ కార్నే స్థానంలో కొత్త వ్యక్తిని నియమించనున్నారు. అక్టోబర్ 31లోపు ఈ నియామకం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ పదవికి పోటీ చేస్తున్న ముఖ్యమైన వ్యక్తుల్లో రాజన్ కూడా ఉన్నారని బ్లూమ్బర్గ్ తెలిపింది. ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో యూకే వెలుపలి వ్యక్తి రాజన్ ఒక్కడే ఉన్నట్టుగా సమాచారం. 2013 నుంచి 2016 మధ్య కాలంలో ఆర్బీఐ గవర్నర్గా రఘురామ్ రాజన్ విశేషమైన సేవలందించారు. అనంతరం ఆయన షికాగోలోని విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా తన సేవలను అందిస్తున్నారు. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్)లోనూ పనిచేసిన అనుభవం రాజన్ సొంతం. బ్రిటన్ పెద్ద బ్యాంక్ పదవికి పోటీపడుతున్న వార్తలపై అటు రఘురాం రాజన్ గానీ, బ్యాంక్ వర్గాలు గానీ స్పందించకపోవడం గమనార్హం. ముఖ్యంగా బ్రెగ్జిట్ ఓటింగ్ సమయంలో అయోమయంలో ఉన్న బ్రిటన్కు మద్దతుగా రాజన్ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ కేంద్ర బ్యాంక్ పదవి రాజన్కే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టుగా లండన్ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.