Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బుధవారం బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన ట్రెండ్తో పాటు బ్యాంకింగ్, ఆర్థిక రంగ షేర్లులో అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ప్రభుత్వం కీలకమైన ఆర్థిక గణాంకాలను వెల్లడించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడం కనిపించింది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో తాజా అమ్మకాలు నమోదయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 193 పాయింట్ల నష్టంతో 39,756 పాయింట్ల వద్ద ముగియగా.. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 59 పాయింట్ల నష్టంతో 11,906 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, ఆటో మొబైల్ షేర్లు నష్టపోయాయి. టాటా స్టీల్, ఓఎన్జీసీ లాభపడగా, యెస్బ్యాంక్, మారుతీ సుజుకీ తదితర షేర్లు నష్టపోయాయి. రిలయన్స్ క్యాపిటల్ షేర్లు 7 శాతం కుంగాయి. ప్రైస్ వాటర్హౌస్ ఆడిటర్లు కంపెనీ నుంచి వైదులుగుతున్నట్టుగా ప్రకటించడంతో ఆ ప్రభావం షేర్లపై పడింది. ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా షేర్లు వరుసగా ఐదో ట్రేడింగ్ సేషన్లో కూడా కుంగాయి. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసు ఈ సంస్థ గ్రేడింగ్ తగ్గించడంతో ఈ పరిస్థితి నెలకొంది. మూడీస్ ఈ సంస్థకు చెందిన ఫారెన్ కరెన్సీ ఇష్యూవర్ రేటింగ్ను తగ్గించనుందనే వార్తల నేపథ్యంలో యెస్బ్యాంక్ షేర్లు 3 శాతం కుంగాయి. స్టాక్ మార్కెట్లలో మరికొద్ది రోజులు ఊగిసలాట ధోరణి కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.