Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 11 ఏండ్లలో 53,334 బ్యాంక్ ఫ్రాడ్లు
- విత్త సంస్థల నష్టం 2.05 లక్షల కోట్లు..
- అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్లో కేసులు
- అత్యల్పంగా పేటీఎంలో ఫ్రాడ్ కేసులు:
- స.హ. చట్టం కింద వెల్లడించిన ఆర్బీఐ
న్యూఢిల్లీ: దేశంలో బ్యాంక్ మోసాలు అంతకంతకు పెరిగిపోతున్నాయి. తాజాగా అందుబాటులోకి వచ్చిన సమాచారం మేరకు గడిచిన 11 ఏండ్లలో దేశీయంగా బ్యాంకుల్లో 50 వేలకు పైగా మోసాలు జరిగాయి. ఈ మోసాల కారణంగా బ్యాంకులు రూ.2.05 లక్షల కోట్ల మేర సొమ్మును బ్యాంక్స్ నష్టపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఆధికారికంగా బుధవారం వెల్లడించింది. అత్యధికంగా బ్యాంక్ మోసం కేసులు ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐలో వెలుగు చూశాయని ఆర్బీఐ గణాంకాలు చెబుతున్నాయి. ఆ తర్వాత స్థానాల్లో ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకులలో ఎక్కువగా మోసం కేసులు వెలుగులోకి వచ్చాయి. సమాచార హక్కు చట్టం (స.హ. చట్టం) కింద దాఖలైన ఒక దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ బ్యాంకు మోసాల వివరాలను వెల్లడించింది. ఆర్బీఐ వెల్లడించిన సమాచారం మేరకు 2008-09 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం 53,334 బ్యాంక్ మోసాలు వెలుగు చూశాయి. ఈ కాలంలో ఐసీఐసీఐలో 6,811, ఎస్బీఐలో 6,793, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 2,497 మోసం కేసులు నమోదయ్యాయి. ఇందులో చిన్న, పెద్ద తరహా మోసాలు కలిసి ఉన్నట్టుగా ఆర్బీఐ తెలిపింది. మోసాల కారణంగా అత్యధికంగా సొమ్మును నష్టపోయిన బ్యాంకుల జాబితాలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (రూ.28,700 కోట్లు), బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ.12,962 కోట్లు), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (రూ.12,644 కోట్లు), బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.12,358 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (రూ.9040 కోట్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. అన్నింటి కంటే తక్కువగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో కేవలం రూ.2 లక్షల విలువైన మోసాలు మాత్రమే నమోదు కావడం విశేషం. ఇక భారత్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బ్యాంకుల విషయానికి వస్తే.. అమెరికన్ ఎక్సెప్రెస్ బ్యాంక్లో అత్యధికంగా 1,862 మోసం ఫిర్యాదులు నమోదయ్యాయి. వీటి మొత్తం విలువ రూ.86.21 కోట్లుగా ఉంది. ఆ తరువాత సిటీ బ్యాంక్లో రూ.578.09 కోట్ల విలువైన 1,754 మోసాలు, హెచ్ఎస్బీసీలో రూ.312.10 కోట్ల విలువైన 1,173 మోసాలు వెలుగు చూశాయి.