Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 7 నెలల గరిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం
- మండుతున్న కూరగాయలు, పండ్ల ధరలు
న్యూఢిల్లీ: దేశంలో సామాన్యులను ధరల మంట ఇబ్బంది పెడుతోంది. కూరగాయలు, పండ్లతో పాటు పలు ఇతర నిత్యవసర వస్తువుల ధరలు పెరిగిపోతుండడంతో ద్రవ్యోల్బణం పరుగులు పెడుతోంది. తాజాగా వినియోగదారు ధరల సూచీ ఆధారంగా లెక్కించే రిటైల్ ద్రవ్యోల్బణం మే మాసంలో 3.05 శాతానికి పెరిగింది. ఇది ఏడు నెలల గరిష్టం కావడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాల కార్యాలయం బుధవారం అధికారికంగా వెల్లడించింది. అంతకు ముందు గత ఏడాది ఆక్టోబరు మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 3.38 శాతంగా నమోదు అయింది. ఆ తరువాత రిటైల్ ద్రవ్యోల్బణం 3.05 స్థాయిని తాకడం ఇదే తొలిసారి. పెరిగిన కూరగాయల ధరలు ద్రవ్యోల్బణాన్ని అత్యధికంగా ప్రభావితం చేశాయని దీంతో వరుసగా నాలుగో నెలలో కూడా ద్రవ్యోల్బణం పెరుగుతూ వచ్చిందని కేంద్ర గణాంకాల కార్యాలయం వివరణనిచ్చింది. ఆహారోత్పత్తుల ద్రవ్యోల్బణం మే నెలలో దాదాపు 1.83 శాతం మేర పెరిగినట్టుగా సర్కారు వర్గాలు తెలిపాయి. అంతకు ముందు ఏప్రిల్ మాసంలో దీని వృద్ధి 1.1 శాతంగా నమోదు అయింది. గణాంకాల కార్యాలయం ఏప్రిల్ ద్రవ్యోల్బణపు అంచనాలను సవరించింది. అంతకు ముందు ఏప్రిల్ మాసపు ద్రవ్యోల్బణాన్ని 2.92 శాతంగా ప్రకటించిన సర్కారు దానిని తాజాగా 2.99 శాతానికి సవరించింది. అంతకు ముందు ఏడాది ఇదే మే మాసంలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.87 శాతంగా నమోదు అయింది. రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ ఆర్బీఐ నిర్ధేశించుకున్న స్థాయి కంటే కూడా తక్కువలోనే నమోదైనందున పెద్ద బ్యాంక్ మరోసారి వడ్డీరేట్లను తగ్గించేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
ఆరు నెలల గరిష్టానికి ఐఐపీ..
మైనింగ్, విద్యుత్తు ఉత్పత్తి రంగాలలో మెరుగైన వృద్ధితో పారిశ్రామికోత్పత్తి ప్రగతి ఏప్రిల్ నెలల 4.5 శాతంగా నమోదు అయినట్టుగా సీఎస్వో తెలిపింది. అంతకు ముందు అక్టోబరు మాసంలో ఐఐపీ 8.4 శాతంగా నమోదు అయింది. ఏప్రిల్ మాసంలో మైనింగ్ రంగంలో ఉత్పత్తి 5.1 శాతం మేర పెరిగింది. అంతకు ఏడాది ఇదే నెలల గనుల విభాగం ఉత్పత్తిలో కేవలం 3.8 శాతం వృద్ధి మాత్రమే నమోదు అయింది. మరోవైపు విద్యుత్తు రంగం ఉత్పత్తిలో కూడా వృద్ధి 2.1 శాతం నుంచి ఆరు శాతానికి చేరుకుంది. అయితే తయారీ రంగంలో మాత్రం మందగమన పరిస్థితులే కనిపించాయి. ఏప్రిల్ నెలలలో తయారీ రంగం ఉత్పత్తిలో వృద్ధి 4.9 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయింది. దేశంలో పెట్టుబడి కార్యకలాపాలకు బారోమీటర్గా ఉండే క్యాపిటల్ గూడ్స్ విభాగంలో వృద్ధి గణనీయంగా 9.8 శాతంనుంచి 2.5 శాతానికి కుంగింది. ఇది ఐఐపీపై ప్రధానంగా ప్రభావం చూపింది. ఇదే సమయంలో మౌలిక రంగం, నిర్మాణ రంగం, మన్నికైన వినియోగదారు వస్తువుల విభాగంలోనూ, వినియోగేతర వస్తువుల విభాగాల్లోనూ మందగమన పరిస్థితులు కనిపించినట్టుగా సీఎస్వో తెలిపింది. మరోవైపు ప్రాథమిక వస్తువుల తయారీ విభాగంలోని ఉత్పత్తి వృద్ధి 2.7 శాతం నుంచి 5.2 శాతానికి చేరింది.