Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయాన్ని ప్రకటించింది. ఆరోగ్య భరోసా కల్పించే కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐ) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల సభ్యత్వ రుసుము చందాను తగ్గించింది. ఈఎస్ఐ చట్టం కింద వారి నుంచి వసూలు చేస్తున్న ప్రాథమిక చందా మొత్తాన్ని 6.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు రెండు దశాబ్దాల తరువాత సర్కారు ఈ దిశగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దాదాపు 13 లక్షల మందికి చిరుద్యోగులకు మేలు జరుగుతుందని సర్కారు చెబుతోంది. దీనికి అదనంగా ఉద్యోగ సంస్థలు, ఉద్యోగులు చెల్లిస్తున్న ఈఎస్ఐ చందా మొత్తాన్ని కూడా తగ్గిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. సాధారణంగా సభ్యత్వ రుసుములో కొంత భాగాన్ని ఉద్యోగి చెల్లిస్తే.. యాజమాన్యం కొంత భాగాన్ని చెల్లిస్తుంది. ప్రస్తుతం చిరుద్యోగి నెల జీతంలో 4.75 శాతం వాటాకు సమానమైన సొమ్ము ఉద్యోగ సంస్థ వాటా కింద 'కార్మిక రాజ్య బీమా సంస్థ'కు (ఈఎస్ఐ) చేరుతుంది. దీనికి అదనంగా ఉద్యోగి వాటా కింద జీతంలో దాదాపు 1.75 శాతం ఈఎస్ఐకి చందా రూపంలో చేరుకుంటుంది. తాజాగా ప్రభుత్వం చేసిన సవరణతో ఉద్యోగ సంస్థ వాటా 3.25 శాతానికి, ఉద్యోగి చందా వాటా మొత్తం 0.75 శాతానికి దిగిరానుంది. సర్కారు తాజా నిర్ణయంతో దాదాపు 3.6 కోట్ల మంది చిరుద్యోగులకు మేలు జరుగనుందని సర్కారు వెల్లడించింది. సవరించిన రుసుములు జులై 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.