Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాది తరువాత సంస్థలోనే కొలువు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ ఐటీ సేవల సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ ''టెక్ బీ'' పేరిట వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆధునిక టెక్నాలజీలో శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ ''టెక్ బీ'' కార్యక్రమాన్ని వివిధ రాష్ట్రాల్లో మొదలు పెట్టనున్నట్టుగా సంస్థ గురువారం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని రెండేళ్ల కిందట చేపట్టామని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్ వెల్లడించారు. అక్కడ మంచి ఫలితాలను సాధించామని చెప్పారు. ఈ టెక్బీ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు త్వరగా ఉద్యోగాల్లో చేరడంతో పాటు, ఆర్థిక స్వావలంబన సాధించాలని, తద్వారా ట్రెండ్ సెట్టర్స్గా నిలవాలని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం 700 మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి తమ కంపెనీలో ఉద్యోగులయ్యారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో దక్షిణాన తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో దృష్టి పెట్టనున్నామని తెలిపారు. అయితే ఈ ప్రోగ్రాంలో చేరాలంటే ఇంటర్మీడియట్లో తప్పనిసరిగా మాథ్స్ ఒక సబ్జెక్టుగా కలిగి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుందని సంస్థ తెలిపింది. ఇలా ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.10 వేల స్టైపెండ్ ఇస్తామని ఆమె చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కాల పరిమితి ఒక సంవత్సరం. ఫీజు రూ.2 లక్షలు. అయితే ఈ ఫీజు మొత్తానికి లోన్ సదుపాయం ఉందని హెచ్సీఎల్ తెలిపింది. ఉద్యోగం వచ్చిన తరువాత ఈమొత్తాన్ని ఈఎంఐ ద్వారా చెల్లించవచ్చు. అలాగే ఇక్కడ శిక్షణపూర్తి చేసుకున్న విద్యార్థులకు రూ.2.5 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగావకాశా లుకల్పిస్తామని శివశంకర్ ప్రకటించారు.