Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల్లో మేలోనే గరిష్టం
న్యూఢిల్లీ : గతనెలలో వాణిజ్య లోటు ఒక లక్ష కోట్ల రూపాయలకు చేరింది. ఇది ఆరు నెలల్లో గరిష్టం కావడం గమనార్హం. గతేడాది డిసెంబర్లో ఈ స్థాయిలో వాణిజ్యలోటు ఏర్పడగా.. తాజాగా మే నెలలో సుమారు ఒక లక్ష కోట్ల రూపాయల లోటు ఏర్పడింది. గతనెలలో ఎగుమతులు ఆరోగ్యకరంగా 3.93 శాతం పెరిగాయి. అంటే సుమారు 30 బిలియన్ యూఎస్ డాలర్ల(ఒక డాలర్ 69 రూపాయలకు సమానం) వృద్ధి నమోదైంది. అయితే దిగుమతులు ఎగుమతులను మించిపోయాయి. గతనెల దిగుమతుల్లో 4.31 వృద్ధి నమోదైంది. అంటే దిగుమతులు 45 బిలియన్ యూఎస్ డాలర్లకు చేరింది. దీంతో వాణిజ్య లోటు 15.36 బిలియన్ యూఎస్ డాలర్ల (సుమారు లక్ష కోట్ల రూపాయలు)కు పెరిగింది. గతేడాది డిసెంబర్ తర్వాత వాణిజ్యలోటు మే లోనే అధికంగా ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గతేడాది డిసెబర్లో వాణిజ్యలోటు 16.67 బిలియన్ యూఎస్ డాలర్లుగా నమోదైంది. మే నెలలో ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఫార్మా, టీ ఎగుమతులు ఊపందుకున్నాయి. కానీ, కీలకరంగాలైన పెట్రోలియం ఉత్పత్తులు, జెమ్స్ జువెలరీ, మెరైన్ ఉత్పత్తులు, కాఫీ, బియ్యం ప్రతికూలంగా నమోదయ్యాయని కామర్స్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆయిల్, బంగారం దిగుమతులు భారీగా పెరిగాయి. కాగా, ఇరాన్ నుంచి చమురు దిగుమతులపై నిషేధం, చమురు ధరల పెరిగే అవకాశమున్న నేపథ్యంలో దిగుమతుల పెరుగుదల అలాగే, పసిడి దిగుమతులపైనా.. నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.