Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆగస్టు 17తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను జిఎస్టి బిల్లు పురోగతి, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల కోతలపై అంచనాలకు తోడు ఇతర అంతర్జాతీయ పరిణామాలు ప్రధానంగా ప్రభావితం చేయనున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి వస్తు సేవల పన్ను (జిఎస్టి)ను అమల్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా రెండు రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ మరింత దిగజారితే ఎగుమతుల రంగం స్టాక్స్కు మద్దతు లభించనుంది. ఇదే సమయంలో ముడి చమురు, గ్యాస్ ఇతర స్టాక్స్పై ఒత్తిడి నెలకొనే అవకాశాలున్నాయి. వరుసగా ఎనిమిదో మాసం జులైలోనూ భారత ఎగుమతుల్లో 10 శాతం క్షీణత చోటు చేసుకుంది. ఈ పరిణామం మార్కెట్లపై ప్రతికూలత చూపించే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే వరుసగా తొమ్మిదో మాసం జులైలో టోకు ద్రవ్యోల్బణం సూచీ మైనస్లో నమోదవడంతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు తగ్గించే అంచనాలు పెరగితే మార్కెట్లకు మద్దతు లభించనుంది. అంతర్జాతీయంగా అమెరికా ఫెడరల్ రిజర్వు జులై 28-29న నిర్వహించిన సమీక్ష నిర్ణయాలను ఆగస్టు 19న వెల్లడించనుంది. ఇందులో ఒక వేళ కీలక వడ్డీ రేట్ల పెంపును ప్రకటిస్తే దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా ఎఫ్ఐఐలు తరిలిపోయే అవకాశాలున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీలపై ఒత్తిడి పెరగనుంది. ఆగస్టు 20తో గ్రీసు రుణ చెల్లింపునకు కూడా తుది గడువుగా ఉంది. ఈ పరిణామాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి. ఈ ఏడాది జులై మాసంలో వినియోగదారుల ద్రవ్యోల్బణం సూచీ 3.78 శాతానికి దిగివచ్చింది. ఇంతక్రితం మాసంలో ఇది 5.40 శాతంగా చోటు చేసుకుంది. మరోవైపు గత జులైలో టోకు ద్రవ్యోల్బణం సూచీ మైనస్ 4.05 శాతానికి పడిపోయింది. వరుసగా తొమ్మిదో మాసంలోనూ టోకు ద్రవ్యోల్బణం దిగజారడంతో వచ్చే వారం మార్కెట్లకు కొంత మద్దతు లభించే అవకాశాలున్నాయి. రూపాయి విలువ క్షీణత కొనసాగితే ఐటి, ఫార్మా షేర్ల కొనుగోళ్లు పుంజుకోనున్నాయి.
గత వారం యువాన్తో నష్టాలు
ఈ నెల 14తో ముగిసిన వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు చవి చూశాయి. ప్రధానంగా చైనా కరెన్సీ యువాన్ విలువ తగ్గించుకోవడంతో ప్రపంచ మార్కెట్లు, ముఖ్యంగా ఆసియా మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి గురి అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ రెండేళ్ల కనిష్టానికి పడిపోయిన నేపథ్యంలో గత వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 169 పాయింట్లు లేదా 0.6 శాతం కోల్పోయి 29,067కు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 46 పాయింట్లు దిగజారి 8,519 వద్ద ముగిసింది. ఈ వారంలో ఐటి, ఫార్మా షేర్లకు మద్దతు లభించగా, లోహ షేర్లు అధిక నష్టాలను చవి చూశా యి. బిఎస్ఇలో మిడ్క్యాప్ సూచీ 1 శాతం, స్మాల్క్యాప్ సూచీ 2.8 శాతం చొప్పున దిగజారాయి. ఈ పార్లమెంట్ సెషన్లోనే జిఎస్టి బిల్లుకు మోక్షం లభిస్తుందన్న మదుపర్ల అశలు నీరుగారడం కూడా మార్కెట్లపై ప్రతికూలతను పెంచింది.