Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నెలకు రూ.6000 కనీస పెన్షన్ ఇవ్వాలి
- 9 ప్రయివేటీకరణ విధానాల్ని నిలిపేయండి..
- 10 లక్షల ఐటీ మినహాయింపులివ్వాలి..
- కొలువుల సృష్టికి పెట్టుబడులుపెంచండి:
సర్కారును కోరిన కార్మిక సంఘాల నేతలు
న్యూఢిల్లీ: దేశంలో కనీస వేతనాన్ని రూ.20,000లకు పెంచాలని, కనీసం పింఛను మొత్తాన్ని రూ.6000లకు చేర్చాలని ప్రధాన కార్మిక సంఘాల ప్రతినిధులు శనివారం ప్రభుత్వాన్ని కోరారు. బడ్జెట్ ముందస్తు సమావేశాల్లో భాగంగా దాదాపు 12 కేంద్ర కార్మిక సంఘాల ప్రతినిధులు శనివారం ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ థాకూర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల ప్రతినిధులు తమ డిమాండ్లను సర్కారు ముందుంచారు. ఉద్యోగులు, పెన్షనర్ల వార్షిక ఆదాయపు పన్ను మినహాయింపును రూ.10 లక్షలకు పెంచాలని వారు డిమాండ్ చేశారు. దీనికి తోడు సీనియర్ సిటిజన్స్కు ఆదాయపు పన్ను మినహాయింపు శ్లాబ్ను రూ.8 లక్షలకు పెంచాలని వారు కోరారు. వయోవృద్ధుల అన్ని భత్యాలను పన్ను పరిధి నుంచి మినహాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ విషయంలో సర్కారు అవలంభిస్తున్న విధానాలను కొన్ని సంఘాల నేతలు బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం. దీనికి తోడు సర్కారు లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించనుందంటూ వస్తున్న వార్తలపై కార్మిక సంఘాలు తమ వ్యతిరేకతను వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో సర్కారు మొండిగా ముందుకు వెళితే తాము దానిని ఆదేస్థాయిలో అడ్డుకొని తీరుతామని నేతలు చెప్పినట్టుగా తెలుస్తోంది. దేశంలో కొత్త కొలువులు పెంచేలా ఉద్యోగాల కల్పనకు గాను ప్రభుత్వ పెట్టుబడులను పెంచాలని వారు సర్కారుకు సూచించినట్టుగా తెలుస్తోంది. కార్మికులు, నైపుణ్యత పెంపు, కొలువుల కల్పన, వేతనాల సవరణ ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరిగినట్టుగా సమాచారం. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలలో ప్రయివేటీకరణను ఆపాలని వారు సూచించినట్టుగా తెలుస్తోంది.
ఆర్థిక మంత్రి సీతారామన్ డుమ్మా..
బడ్జెట్ సమావేశాలకు ముందు ప్రభుత్వం దేశంలోని కేంద్ర కార్మిక సంఘాల నేతలు, ప్రతినిధులతో సమావేశమవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సమావేశంలో కార్మికుల అభిప్రాయాలను వారి ఆకాంక్షలను సర్కారు తెలుసుకొని వాటికి బడ్జెట్లో తగిన కేటాయింపులు ప్రకటించడం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశంలోని దాదాపు 12 కేంద్ర కార్మిక సంఘాలను శనివారం బడ్జెట్ ముందస్తు సమావేశానికి ఆహ్వానించారు. ఆర్థిక మంత్రి ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చిన కార్మిక నేతలకు తీవ్ర అసంతృప్తి ఎదురైంది. నిటి ఆయోగ్ మీటింగ్ నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ సమావేశానికి హాజరు కాలేదు. దీంతో ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి అనురాగ్ థాకూర్ కార్మిక నేతల సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్మిక సంఘాల ప్రతినిధుల డిమాండ్లను వారి ఆకాంక్షలను మంత్రి తెలుసుకున్నారు. అయితే నిర్మాల సీతారామన్ తమను సమావేశానికి ఆహ్వనించి, మరో సమావేశానికి వెల్లడం తమను అవమానించడమేనని కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.